ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అత్యంత ఆదరణ పొందిన రూ. 249 రీచార్జ్ ప్లాన్ను నిలిపివేసింది. దీంతో రోజువారీ డేటా, అపరిమిత కాల్స్ వంటి ప్రయోజనాలు కోరుకునే కస్టమర్లు ఇకపై కనీసం రూ. 299తో రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పు ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో "ధర సవరించబడింది" అనే గమనికతో స్పష్టమైంది.ఇప్పటివరకు అందుబాటులో ఉన్న రూ. 249 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 24 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభించేవి. దీనికి అదనంగా ఉచిత హలో ట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కంటెంట్, రూ. 17,000 విలువైన పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉండేవి. ఇప్పుడీ ప్లాన్ను తొలగించడంతో, ఈ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్లయింది.రూ. 249 ప్లాన్ స్థానంలో ఇప్పుడు రూ. 299 ప్లాన్ ప్రామాణికంగా మారింది. ఈ ప్లాన్లో దాదాపు అవే ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వ్యాలిడిటీని 28 రోజులకు పెంచారు. అంటే, వినియోగదారులు దాదాపు అవే సౌకర్యాల కోసం అదనంగా రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే, 4 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది.గమనించాల్సిన విషయం ఏమిటంటే, మార్కెట్ లీడర్ అయిన రిలయన్స్ జియో కూడా గతంలోనే తన రూ. 249 ప్లాన్ను నిలిపివేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్లో వొడాఫోన్ ఐడియా మాత్రమే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తున్న ఏకైక సంస్థగా నిలిచింది. టెలికాం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa