భారత్పై 50 శాతం సుంకాలను విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్ధికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఇది అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత పనికిమాలిన వ్యూహాత్మక చర్య అని ఆయన దుయ్యబట్టారు. ఇంతకు ముందు కూడా సాక్స్.. ట్రంప్ ఆర్థికంగా నిరక్షరాస్యుడని, అమెరికాను భారత్ అసలు నమ్మొద్దని సూచించారు. అమెరికా అధ్యక్షుడు బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)ని ఏకం చేసిన గొప్ప వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్రేకింగ్ పాయింట్స్ కార్యక్రమంలో భాగంగా క్రిస్టల్ బాల్, సాగర్ ఎంజెటిల ఇంటర్వ్యూలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రతీకార సుంకాలు అమెరికాపై దుష్ప్రభావాలు చూపి, దీర్ఘకాలిక ఫలితాలను మిగులుస్తాయని హెచ్చరించారు.
‘‘భారత్పై ట్రంప్ విధించిన ఈ సుంకాలు వ్యూహం కాదు.. అవి విధ్యంసకారక చర్యలు.. అమెరికా విదేశాంగ విధానంలో తీసుకున్న అత్యంత మూర్ఖత్వ వ్యూహాత్మక చర్య’’ అని దుయ్యబట్టారు. ట్రంప్ చర్యలు బ్రిక్స్ దేశాలను మరింత దగ్గర చేశాయని సాక్స్ వ్యాఖ్యానించారు. ‘’భారత్పై ట్రంప్ సుంకాలు బ్రిక్స్ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని, ఇది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బకొట్టింది.. బ్రిక్స్ ఏకీకరణకర్త ట్రంప్.. నాకు బ్రిక్స్ నచ్చుతుంది కాబట్టి అందులో ఎలాంటి అభ్యంతరం లేదు... కానీ దక్షిణ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం, ట్రంప్ మాజీ వాణిజ్య సలహదారులు పీటర్ నావారోలు ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది’’ అని అన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందనే కారణంతో భారత్పై ట్రంప్ కక్షగట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దక్షిణ కరోలినా సెనేటర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సాక్స్.. లిండ్సే గ్రాహం అమెరికాలో అత్యంత చెత్త సెనేటర్ అని, ఆయన ఓ మూర్ఖుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పీటర్ నావారోపై కూడా విమర్శలు గుప్పించారు. అర్ధశాస్త్రంలో ఇప్పటివరకూ ఇచ్చిన అత్యంత అర్హతలేని పీహెచ్డీ నావారోదే కావచ్చునని, ఆయనకు ఎకనమిక్స్లో డాక్టరేట్ అయితే మాత్రం ఉంది కానీ, అందులో ఏమీ నేర్చుకోలేదని సాక్స్ ఎద్దేవా చేశారు.
అమెరికాతో భారత్ వ్యూహాత్మక సంబంధాలు బలపడుతోన్న సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అది ఒక్కరాత్రిలోనే విచ్ఛిన్నమైందని సాక్స్ అన్నారు. ఒకవేళ ట్రంప్ సుంకాలను ఎత్తివేసినా.. అమెరికాను నమ్మకూడదనే పాఠం భారతీయులు నేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘జీరో ప్రాక్టికల్ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఇది అమెరికా విదేశాంగ విధానంలో ఏళ్లుగా నిర్మించుకున్న ఒక ముఖ్యమైన బంధాన్ని పూర్తిగా దెబ్బతీసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa