ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూముల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా పంట భూముల సర్వే నంబర్లు, ఎల్పీఎం నంబర్ల వివరాలను సేకరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలో శుక్రవారం అధికారులు భూముల సమాచారం సేకరించారు. చేబ్రోలు మండలంలోని గ్రామాలను దాటి ఔటర్ రింగ్ రోడ్డు.. వట్టిచెరుకూరు మండలంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్తున్నారు. అనంతవరప్పాడు పరిధిలోకి ప్రవేశించి.. అక్కడ నుంచి వింజనంపాడు, చమళ్లమూడి, కుర్నూతల, పుల్లడిగుంట, కొర్నెపాడు పంట పొలాల మీదుగా.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తున్నట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. పెదకూరపాడు, అమరావతి మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్న సంగతి తెలిసిందే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గతంలో 70 మీటర్ల వెడల్పుతో 180 కిలోమీటర్ల మేరకు నిర్మించాలని ప్రణాళికలు రచించారు. అయితే అమరావతి నగరం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి ఓఆర్ఆర్ను 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. అమరావతి ఔటర్ రింగ్రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ స్థానంలో ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేలా రెండుచోట్ల లింక్రోడ్ల నిర్మించాలని నిర్ణయించింది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో.. అదనపు 70 మీటర్ల వెడల్పునకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో వేయి కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించనుంది. మరోవైపు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలోనే అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో అమరావతికి వాహనాల రాకపోకలు పెరుగుతాయని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా భూసేకరణకు కసరత్తు జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa