ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 07:44 PM

రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణాలు పొందేందుకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అవసరం లేదని తెలిపింది. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు వెల్లడించారు. రుణాలు పొందడానికి పాస్ పుస్తకాలతో పని లేదని తెలిపారు. ప్రతి బ్యాంకర్‌కు కూడా.. లైవ్ వెబ్‌ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ అందుబాటులో ఉంటుందన్న మంత్రి.. దాని ద్వారా మాత్రమే రైతులకు బ్యాంకులు రుణాలు అందిస్తాయని వివరించారు. తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రైతులకు పాస్ పుస్తకాలు అందించే ముందు మరోసారి పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నమని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలను సరిచేస్తున్నామన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. రీ సర్వే జరిగిన గ్రామాల్లో సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. రైతుల అర్జీలను వంద శాతం పరిష్కరించామని వెల్లడించారు.


రైతులకు పంపిణీ చేయడానికి 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని.. తప్పులు లేకుండా ఈ పాస్ పుస్తకాలు రైతులకు అందించే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇంతవరకూ తప్పులతో ఒక్క పాసు పుస్తకం కూడా ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. రైతులు రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలతో సంబంధం లేదని వెల్లడించారు. రీసర్వే జరిగిన గ్రామాలలో సదుద్దేశంతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామని.. అందరూ సహకరించాలని సత్యప్రసాద్ కోరారు. మరోవైపు బ్యాంకులలో పట్టాదారు పాసు పుస్తకాలను ఉంచి రైతులు వ్యవసాయ రుణాలు పొందుతూ ఉంటారు. అయితే ఈ లైవ్ వెబ్‌ల్యాండ్ లోన్ చార్ట్ మాడ్యూల్ ద్వారా పాసు పుస్తకాల అవసరం లేకుండానే రైతులు రుణాలు పొందవచ్చని మంత్రి సత్యప్రసాద్ చెప్తున్నారు.


మరోవైపు రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఉచితంగా అందించనున్నారు. పాసు పుస్తకాలు అందిన తర్వాత వాటిలో ఏవైనా మార్పులు ఉంటే.. నిబంధనలను పరిశీలించి వాటిని కూడా ఉచితంగా చేసి పెట్టనున్నారు. ఈ విషయాన్ని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. జాయింట్ ఎల్పీఎమ్‌ల సబ్ డివిజన్‌ విషయంలో.. ఇప్పటి వరకూ లక్షకు పైగా అభ్యర్ధనలు పరిష్కరించామని.. వీటికి ఎలాంటి ఫీజు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.


కొత్త పట్టాదారు పాసు పుస్తకంలోని భూమి యజమాని ఫోటోను ముందుగానే పరిశీలించి.. మార్పులు ఉంటే జాయింట్ కలెక్టర్లు కొత్త ఫోటో ముద్రించి ఇస్తారని తెలిపారు. పేర్లు, లింగం వంటి విషయాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని కూడా సరి చేస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa