ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్‌లో ప్రధాని భద్రతకు అడ్డుగా చెట్టు.. అక్కడి నుంచి తొలగించనున్న అధికారులు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 23, 2025, 08:32 PM

ఇటీవల ఓ యువకుడు కొత్త పార్లమెంటు భవనం గోడ ఎక్కి దూకి.. లోపలికి ప్రవేశించిన ఘటన దేశవ్యా్ప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంటులో భద్రతా పరమైన చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగానే పార్లమెంటులో ఉన్న ఒక చెట్టును తొలగించాలని నిర్ణయించారు. ఆ చెట్టు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతకు అడ్డుగా ఉన్నట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ - ఎస్పీజీ గుర్తించింది. ఈ క్రమంలోనే దాన్ని అక్కడి నుంచి తీసి.. వేరే చోట నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


కొత్త పార్లమెంట్ భవనానికి ఉన్న ఆరు ద్వారాల్లో ఒకటైన గజ్ ద్వార్ వద్ద ఉన్న చెట్టును.. అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అధికారిక పత్రాల ప్రకారం.. ప్రధాని భద్రతను చూసుకునే ఎస్పీజీ.. గజ్ ద్వార్ వద్ద ఉన్న సిల్వర్ ట్రంపెట్ ట్రీను వీవీఐపీ మార్గంలో ఒక అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఆ చెట్టు బాగా ఏపుగా పెరిగి.. పచ్చటి ఆకులు, పసుపు రంగు పువ్వులతో నిండి ఉందని.. దీని వల్ల భద్రత పరంగా సమస్యలు తలెత్తుతాయని ఎస్పీజీ తెలిపింది.


 ఎస్పీజీ తెలిపిన ప్రధాని భద్రతా ఆందోళనలను ప్రస్తావించిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఢిల్లీ అటవీ శాఖకు ఒక రిక్వెస్ట్ పంపించింది. అయితే కొన్ని కఠినమైన షరతులతో చెట్టును మార్చేందుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ చెట్టును తొలగిస్తే.. దాన్ని అక్కడి నుంచి వేరే స్థానంలో నాటాలని కండీషన్ పెట్టింది. దీంతో ఆ చెట్టును ప్రేరణ స్థల్ అనే ప్రాంతానికి మార్చనున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే దేశంలోని పలువురు నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.


ఇక ఈ చెట్టు తరలింపు ప్రక్రియలో భాగంగా.. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ వేప, అమ్తాస్, రావి, మర్రి, శీషం, అర్జున వంటి 10 మొక్కలను ప్రేరణ స్థల్‌ ప్రాంతంలో నాటాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటిని 7 ఏళ్లపాటు సంరక్షించాల్సి ఉంటుంది. అలాగే రూ.57 వేలు డిపాజిట్ చేయాలని తెలిపింది. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసినందున.. వచ్చే వారం చెట్టును మార్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ చెట్టు వయసు సుమారు 7 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు.


ఇటీవల శుక్రవారం ఉదయం.. ఒక 20 ఏళ్ల యువకుడు రెడ్ క్రాస్ రోడ్డులోని ఐజీ-2 గేట్ సమీపంలో పార్లమెంట్ భవనం గోడను ఎక్కేందుకు ప్రయత్నించాడు. అతను గోడ పక్కనే ఉన్న ఒక చెట్టును ఎక్కినట్లు అధికారులు చేపట్టిన దర్యాప్తులో తేలింది. ఆ యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత.. పార్లమెంటు భద్రతాపరమైన అంశాలపై అధికారులు మరింత దృష్టి పెట్టారు. భద్రత కోసం ఒక చెట్టును తొలగించడం అనేది చాలా అరుదైన సంఘటన కాగా.. అది ప్రధాని భద్రతకు సంబంధించినది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa