దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మరోవైపు.. కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల దేశంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో.. అనేక కఠిన నిర్ణయాలు కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తూ.. భవిష్యత్ అంతా ఈవీలదే అని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని అటల్ సేతుపై ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్ల నుంచి టోల్ ఫీజులు వసూలు చేయమని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం 2025 ఎలక్ట్రిక్ వాహనాల విధానంలో కీలక మార్పులు చేసింది. రాజధాని ముంబైలోని కీలకమైన అటల్ సేతుపై ఎలక్ట్రిక్ కార్లకు టోల్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 22వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
మహారాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్ట్ 22వ తేదీ నుంచి అటల్ సేతు పై అన్ని ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ వాహనాలు (కేటగిరీ M1), ఎలక్ట్రిక్ బస్సులకు (కేటగిరీ M3, M4) లు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ బస్సులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్స్ మాత్రం టోల్ ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అటల్ సేతు మార్గంలోని శివాజీ నగర్, గవాన్ టోల్ గేట్ల వద్ద ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.
కేవలం ముంబై అటల్ సేతు మార్గంలోనే కాకుండా.. ఇతర ప్రాంతాలకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేయనుంది. ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే, సమృద్ధి ఎక్స్ప్రెస్వేలపై కూడా.. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫీజులను త్వరలోనే రద్దు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక మహారాష్ట్రలోని ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారికి.. రాష్ట్ర, జాతీయ రహదారులపై చెల్లించాల్సిన టోల్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్ కల్పించనున్నట్లు ప్రకటించింది.
మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేవారికి భారీ ఊరటను కల్పించనుంది. అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించి.. పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడంలో ఇది ఒక కీలకమైన ముందడుగు అని పలువురు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa