8 ఏళ్ల వయసున్న బాలిక అందరిలాగే ఆరోజు బడికి వెళ్లింది. అయితే ఉదయమే లేవడం.. పొద్దుటి నుంచి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, ఆడిన ఆటలతో అలసిపోయి తరగతిలోనే పడుకుండి పోయింది. అయితే ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. గంట కొట్టగానే తరగతి గదిలోని పిల్లలంతా వెళ్లిపోగా.. మంచి నిద్రలో ఉన్న బాలిక మాత్రం అక్కడే ఉండిపోయింది. విషయం గుర్తించని సిబ్బంది సైతం తరగతి గదికి తాళం వేశారు. దీంతో చిన్నారి లోపలే ఉండిపోయింది. రాత్రి కాగానే బాలికకు మెల్కువ వచ్చింది. చుట్టూ ఎవరూ లేకపోవడం, చీకటిగా ఉండడంతో బిగ్గరగా ఏడ్చింది. ఎలాగైనా బయటపడాలని కిటికీ తలుపులు తెరిచి అందులోంచి బయటకు రావాలని ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు తల అందులోనే ఇరుక్కుపోవడంతో.. రాత్రంతా నరకం చూసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఒడిశాలోని కెయోంఝర్ జిల్లా అంఝార్ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక జ్యోత్స్న దేహురి అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అయితే తరగతులు ముగిసే సమయంలో జ్యోత్స్న బెంచీపై నిద్రలోకి జారుకుంది. ఇంటికి వెళ్లే గంట కొట్టిన తర్వాత క్లాసులోని చిన్నారులంతా బయటకు వెళ్లిపోయారు. కానీ మంచి నిద్రలో ఉన్న జ్యోత్స మాత్రం అదే బెంచీపై పడుకున్నారు. అయితే ఆ రోజున తరగతి గదులను మూసేసే బాధ్యతను ఏడో తరగతికి చెందిన ఇద్దురు విద్యార్థులకు అప్పగించారు. ఇలా వారు బడిలోని అన్ని గదులకు తాళాలు వేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రెండో తరగతికి చెందిన గదికి కూడా తాళం వేశారు. ఇంటికి వెళ్లాలనే ఆత్రంతో లోపల ఎవరైనా ఉన్నారా లేరా అని కూడా చూసుకోలేదు.
పాఠశాలలోని అన్ని గదులను మూసివేసే బాధ్యత సాధారణంగా వంట సిబ్బందికి ఉంటుంది. కానీ వారు ఆ రోజు లేకపోవడంతో ప్రిన్సిపాల్ ఈ బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు. ఇలా వారు చూడకుండా తాళం వేయడంతో.. జ్యోత్స్న దేహురి తరగతి గదిలోనే ఉండిపోయింది. అయితే చీకటి పడిన తర్వాత నిద్ర లేచిన జ్యోత్స్న.. తాను తరగతి గదిలో ఒంటరిగా ఉన్నానని గుర్తించింది. ఎవరూ లేకపోవడం, అందులోనూ చీకటిగా ఉండంతో చాలా భయపడిపోయింది. వెంటనే వెళ్లి తలుపులు తీసే ప్రయత్నం చేసింది. కానీ తాళం వేసి ఉందని గ్రహించి మరింతగా ఎడ్వడం ప్రారంభించింది. ఈక్రమంలోనే.. కిటీకి తలుపులు తెరిచి అందులోంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
తలతో పాటు కాళ్లు, చేతులు కిటికీ గ్రిల్లో పెట్టేసింద. కానీ దురదృష్టవశాత్తు ఆ కిటికీలో చిన్నారి తల ఇరుక్కుపోయింది. ఇటు బయటకు రాలేక, లోపలికీ వెళ్లలేక నరకం చూసింది. రాత్రంతా ఏడుస్తూ.. భయపడిపోతూనే ఉంది. చీకట్లో ఆ చిన్నారి అనుభవించిన భయం, వేదన మాటల్లో చెప్పలేనివి. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు కిటికీలో చిక్కుకుపోయి ఏడుస్తున్న బాలికను చూశారు. వెంటనే వారు స్థానిక అధికారులకు, రెస్క్యూ టీమ్కు సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. ఆ చిన్నారిని జాగ్రత్తగా బయటకు తీశారు. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జిల్లా యంత్రాంగం.. పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఆయనను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక అధికారులు కూడా బాధిత బాలిక కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa