ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులు.... ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 07:33 PM

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో నేచర్ క్యూర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి నేచర్ క్యూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇదే కానుంది. ఈ నేచర్ క్యూర్ మెడికల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగాసైన్సెస్ కోర్సును బోధించనున్నారు. 20260-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సును బోధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనితో పాటుగా విశాఖపట్నం, కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులు నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


విశాఖపట్నంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో ఈ నేచర్ క్యూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మించనున్నారు. రూ.16.40 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా.. 50 సీట్లు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాలేజీతో పాటుగా 50 పడకల సామర్థ్యం ఉండే ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రి నిర్మించనున్నారు. రూ.14.85 కోట్ల వ్యయంతో ఆయుష్ ఆస్పత్రి నిర్మాణం కానుంది.


హోమియోపతి, ఆయుర్వేద, యునాని వైద్యసేవలు ఈ ఆయుష్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అలాగే ఆరు కోట్ల రూపాయలతో సొంత్యం ప్రాంతంలో ఆయుర్వేద మెడిసిన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని వివరించారు. ఈ ల్యాబ్‌లో పరికరాల కోసం ప్రభుత్వం మరో ఐదు కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని తెలిపారు.


ధర్మవరం, కాకినాడలో ఆయుర్వేద మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం నేషనల్ ఆయుష్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.45 కోట్లతో వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ధర్మవరంలో ప్రతిపాదించిన ఆయుర్వేదిక్ కాలేజీలో 50 పడకల సామర్థ్యంతో ఆయుర్వేదిక్ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa