ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంపై ఢిల్లీ హైకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. ఆయన బ్యాచిలర్ డిగ్రీ వివరాలను వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ సచిన్ దత్తా ఈ మేరకు తీర్పును ప్రకటించారు.సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం, తాజాగా యూనివర్సిటీ వాదనలతో ఏకీభవించింది. 1978లో బీఏ ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను పరిశీలించేందుకు అనుమతించాలంటూ నీరజ్ అనే వ్యక్తి చేసిన ఆర్టీఐ దరఖాస్తు మేరకు సీఐసీ 2016లో ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులపై హైకోర్టు 2017లోనే స్టే విధించింది.విచారణ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విద్యార్థుల రికార్డులను విశ్వాసంతో భద్రపరిచే బాధ్యత తమపై ఉందని, వాటిని గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. కేవలం తెలుసుకోవాలన్న ఉత్సుకత కోసం, విస్తృత ప్రజా ప్రయోజనం లేనప్పుడు ఆర్టీఐ చట్టం కింద ఆ సమాచారాన్ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ 1978లో బీఏ డిగ్రీ పొందినట్లు తమ వద్ద రికార్డులు ఉన్నాయని, వాటిని కోర్టుకు చూపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా పేర్కొన్నారు.మరోవైపు, ఆర్టీఐ దరఖాస్తుదారు తరఫు న్యాయవాది ప్రధాని విద్యా వివరాలు తెలుసుకోవడంలో విస్తృత ప్రజా ప్రయోజనం ఉందని వాదించారు. అయితే, ఈ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు, ఢిల్లీ యూనివర్సిటీ వాదనకే మొగ్గుచూపి సీఐసీ ఆదేశాలను రద్దు చేసింది. తాజా తీర్పుతో ఈ వివాదానికి తెరపడినట్లయింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa