భారత్ నుంచి ప్రతీ సంవత్సరం లక్షల మంది విదేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తూ ఉంటారు. విదేశాల్లో పనిచేస్తే.. అధిక వేతనాలు వస్తాయనే ఆశతో వెళ్తారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. ఇక అమెరికా, బ్రిటన్ సహా వెస్ట్రన్ దేశాలు ప్రస్తుతం తమ దేశానికి ఉద్యోగ, ఉపాధి కోసం వలస వచ్చే ప్రపంచ దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. రకరకాల కారణాలు, కొత్త కొత్త నిబంధనలతో.. ఆయా దేశాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు.. మన మిత్ర దేశం రష్యా గుడ్న్యూస్ చెప్పింది. భారతీయులకు రష్యాలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఉద్యోగాలకు భారతీయ నిపుణులను తీసుకోవడంపై రష్యాకు చెందిన కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం రష్యాలో మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని వినయ్ కుమార్ తెలిపారు. భారత్లో నైపుణ్యం కలిగిన కార్మికులు పుష్కలంగా ఉన్నారని పేర్కొన్నారు. రష్యాలోని నిబంధనలు, చట్టాలు, కోటాలకు లోబడి అక్కడి కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణ రంగం, టెక్స్టైల్స్ రంగాల్లో ఎక్కువగా భారతీయులు పని చేస్తున్నారని.. అయితే ఇప్పుడు యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా భారతీయులకు బాగా డిమాండ్ పెరుగుతోందని వివరించారు.
మరోవైపు.. రష్యాలో భారతీయ కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో రాయబార కార్యకలాపాలు పెరుగుతున్నాయని వినయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాలకు పౌరులు రాకపోకలు సాగించేటపుడు.. పాస్పోర్ట్ గడువు పొడిగించుకోవడానికి, పాస్పోర్ట్ పోయినపుడు లేదా పిల్లలు పుట్టిన తర్వాత రాయబార కార్యాలయం సేవలు అవసరమం అవుతాయని వెల్లడించారు. మరోవైపు.. భారతదేశ విదేశాంగ విధానంలో రష్యాతో సంబంధాలు కీలకమని.. ఎప్పటినుంచో రష్యా.. భారత్కు ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉందని తెలిపారు.
ఇక రష్యాలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, కార్మికులు పెరుగుతున్నారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం.. అక్కడ సుమారు 14 వేల మంది భారతీయులు ఉన్నారు. ఇక భారతీయ మూలాలు ఉన్న సుమారు 1500 మంది ఆఫ్ఘన్ పౌరులు కూడా నివసిస్తున్నారు. వీరిలో మెడికల్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థల్లో ప్రస్తుతం సుమారు 4,500 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో సుమారు 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న 20 యూనివర్సిటీల్లో మెడిసిన్ చదువుతున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్, ట్రాన్స్పోర్టు టెక్నాలజీ, మేనేజ్మెంట్, అగ్రికల్చర్, బిజినెస్/ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నారు.
గత మూడున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. దీంతోపాటు రష్యాలోని యువ జనాభా ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల తప్పనిసరిగా.. ఇతర దేశాల నుంచి భారీగా శ్రామిక శక్తి రష్యాకు అవసరం అవుతోంది. ఈ కారణాలతోనే 2030 కల్లా రష్యాలో 31 లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిశ్రమల్లో కార్మిక కొరతను తీర్చేందుకు ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది నిపుణులైన భారతీయ కార్మికులను తీసుకోవాలని రష్యా భావిస్తున్నట్లు ఇటీవల మీడియా కథనాలు బయటికి వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa