ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:37 PM

భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం మరోసారి తన సత్తాను చాటింది. దేశీయంగా నిర్మించిన రెండు అత్యాధునిక నీలగిరి-క్లాస్ స్టెల్త్ యుద్ధనౌకలు ‘ఐఎన్ఎస్ హిమగిరి’, ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ మంగళవారం నౌకాదళంలోకి ప్రవేశించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఈ రెండు యుద్ధనౌకలను లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని రెండు వేర్వేరు ప్రతిష్ఠాత్మక షిప్‌యార్డ్‌ల నుంచి ఒకేసారి రెండు ప్రధాన యుద్ధనౌకలను ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ప్రాజెక్ట్ 17 ఆల్ఫా (పీ-17ఏ)లో భాగంగా ఈ యుద్ధనౌకలను నిర్మించారు. ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను, సాంకేతికతను వినియోగించారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి నిదర్శనమని అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) నిర్మించగా, ఐఎన్ఎస్ ఉదయగిరిని ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (ఎండీఎల్) తయారుచేసింది. ఈ రెండు నౌకలు ఒకేసారి దళంలోకి చేరడం, దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యం ఎంతగా పెరిగిందో తెలియజేస్తోందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.ఈ రెండు నౌకలు తూర్పు నౌకాదళంలో సేవలు అందించనున్నాయి. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని, వారి ‘ముత్యాల హారం’ వ్యూహాన్ని అడ్డుకోవడంలో ఈ యుద్ధనౌకలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ నౌకల చేరికతో భారత నౌకాదళ యుద్ధ సన్నద్ధత మరింత పెరిగింది.సుమారు 6,700 టన్నుల బరువు, 149 మీటర్ల పొడవు ఉండే ఈ నౌకలు గంటకు 28 నాట్ల సుమారు 52 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలవు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీని వాడటం వల్ల శత్రువుల రాడార్లకు సులభంగా చిక్కవు. బరాక్-8, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, 76 ఎంఎం గన్ లతో వీటిని శక్తిమంతం చేశారు. అంతేకాదు, టార్పెడోలను ఎదుర్కొనే మారీచ్ వంటి పటిష్ట వ్యవస్థలను వీటిపై మోహరించారు. అంతేకాకుండా, రెండు హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయగల సామర్థ్యం వీటి సొంతం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa