నూతన పశ్చిమగోదావరి జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక ప్రకటన చేశారు. కలెక్టరేట్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తానే సమకూర్చడంతో పాటు, నిర్మాణ ఖర్చులో సగం భరిస్తానని ఆయన ముందుకొచ్చారు. ఈరోజు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లా ఏర్పడిన నాటి నుంచి కలెక్టరేట్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోందని రఘురామ గుర్తుచేశారు. గతంలో మార్కెట్ యార్డులో స్థలం కేటాయించినా, ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కలెక్టరేట్ నిర్మాణ బాధ్యతలో తాను పాలుపంచుకుంటున్నట్లు ప్రకటించారు.కలెక్టరేట్ భవనాన్ని సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్నట్లు రఘురామ తెలిపారు. దీనికి మొత్తం రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, అందులో రూ.35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, మిగిలిన రూ.35 కోట్లను తానే సమకూరుస్తానని హామీ ఇచ్చారు. "స్థలం నేను ఇచ్చాను, సగం డబ్బు కూడా ఇస్తానని మాట ఇచ్చాను" అని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై కొందరు సంకుచిత స్వభావంతో మాట్లాడుతున్నారని, మండలి ఛైర్మన్ దీనిని ఇరిగేషన్ భూమి అన్నారని రఘురామ ప్రస్తావించారు. తాను భీమవరం, ఉండి అని వేరుగా చూడటం లేదని, జిల్లా అంతా ఒకే యూనిట్గా భావిస్తున్నానని స్పష్టం చేశారు. పెద అమిరం గ్రామాన్ని భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ బృహత్ కార్యక్రమానికి త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తాను స్వయంగా కోరినట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa