ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా జట్టుకు వీడ్కోలు పలికిన విహారి

sports |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:30 AM

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు ఆంధ్రా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన హనుమ విహారి ఇకపై త్రిపుర జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నానని, త్రిపుర జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా, తనకు మూడు ఫార్మాట్లలో ఆడే అవకాశం ఉంటుందని వివరించాడు. ఇప్పటివరకు తన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రా క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విహారి వెల్లడించాడు. అయితే, తన ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం జట్టు మార్పు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ తాజా సవాలు పట్ల ఉద్విగ్నతతో ఉన్నానని, త్రిపుర జట్టుకు తన శక్తిమేర సేవలు అందించేందుకు నిబద్ధతతో శ్రమిస్తానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 31 సంవత్సరాల హనుమ విహారి టీమిండియా తరఫున 16 టెస్టులాడి 839 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు హైదరాబాద్, ఆంధ్రా క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన విహారి 49.92 సగటుతో 9,585 పరుగులు చేశాడు. అందులో 24 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa