ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు మరో మహిళ జీవితాన్ని కాజేశాయి. గుల్ ఫిజా అనే మహిళను అత్తమామలు బలవంతంగా యాసిడ్ తాగించి హింసించిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలు 17 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ చివరికి మృతి చెందింది.
గుల్ ఫిజా గత ఏడాది కాలా ఖేడా గ్రామానికి చెందిన పర్వేజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన దగ్గర నుండి కట్నం కోసం వేధింపులు మొదలైనట్లు మృతురాలి తండ్రి ఫుర్ఖాన్ పేర్కొన్నారు. వరకట్నం ఇవ్వలేదని ఆమెను తరచూ హింసించారని, చివరికి ప్రాణాలే తీసే స్థాయికి వెళ్లారని ఆయన వాపోయారు.
ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశారు. గుల్ ఫిజా మరణానికి కారకులైన అత్తమామలపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల హృదయవిదారక వేదన నేపథ్యంలో స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుల్ ఫిజా మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వరకట్న వేధింపుల పేరుతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సామాజికంగా ఆందోళనకరంగా మారుతున్నాయి. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa