ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాకు దిమ్మదిరిగే షాకిచ్చిన జపాన్

international |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 09:51 PM

వాణిజ్య భాగస్వామ్య దేశాలను సుంకాలతో బెదిరించి దారికి తెచ్చుకోవాలని భావిస్తోన్న అగ్రరాజ్యానికి మరో షాక్ తగిలింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం బయలుదేరాల్సిన జపాన్ ప్రతినిధి రయాసే అకాజవా చివరి నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు నుంచి తప్పించుకోడానికి జపాన్ అమెరికాకు అందించే 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి ప్యాకేజీ ఖరారు చేయడంలో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 500 బిలియన్ డాలర్లు ప్యాకేజీ, దాని ఆర్ధిక వివరాలు, ఇరు దేశాల మధ్య ఆదాయ విభజన వంటి వాటిని అధికార ధ్రువీకరణ కోసం అకాజవా గురువారం అమెరికాకు బయలుదేరాల్సి ఉందని రాయిటర్స్ నివేదించింది. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ సైతం జపాన్ పెట్టుబడి ప్యాకేజీపై ఈ వారంలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనకు ముందు ఇది జరగడం గమనార్హం.


జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాసా హయాషీ ప్రకారం.. ‘అమెరికావైపు నుంచి ఉన్నతస్థాయిలో పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని గుర్తించాం.. అందుకే జపాన్ ప్రతినిధి రయాసే అకాజవా అమెరికా పర్యటన రద్దయ్యింది’ అని అన్నారు. పెట్టుబడి హామీకి బదులుగా టోక్యోపై సుంకాలను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంపై వాణిజ్య ఒప్పందంపై అమెరికా, జపాన్‌లు అవగాహనకు వచ్చాయి.


అయితే, డొనాల్డ్ ట్రంప్ జపాన్ ప్యాకేజీ గురించి మాట్లాడుతూ.. ‘ఇది మన సొమ్ము… మనం ఇష్టం వచ్చినట్లు పెట్టుబడి పెట్టుకోవచ్చు’ అని పేర్కొని, లాభాల్లో 90 శాతం అమెరికా వాటా అని తెలిపారు. దీనికి జపాన్ అధికారులు దీనికి విరుద్దంగా స్పందించారు. ఈ పెట్టుబడి ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండాలని స్పష్టంచేశారు.


హయాషి కూడా ట్రంప్ ప్రకటనలో సవరణ కోరుతూ.. ‘పరస్పర సుంకాలపై అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను వీలైనంత త్వరగా సవరించే చర్యలు తీసుకోవాలని, అలాగే ఆటోమొబైల్స్ విడి భాగాలపై సుంకాలను తగ్గించేలా ట్రంప్ ఆదేశం జారీ చేయాలని మేము బలంగా కోరుతున్నాం’ అని అన్నారు. జపాన్ అధికారులు పదేపదే చెబుతున్నది ఏమిటంటే.. పెట్టుబడుల వివరాలపై సంయుక్త ప్రకటన విడుదలకు ముందు, జపాన్‌పై ఉన్న అదనపు సుంకాలను తొలగించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో సవరణ చేయాలని కోరుతున్నారు.


కాగా, అకాజావా మళ్లీ అమెరికాకు ఎఫ్పుడు వెళ్తారో నిర్ణయించలేదని జపాన్ మీడియా క్యోడో న్యూస్ నివేదించగా.. రాయిటర్స్ మాత్రం వచ్చేవారం ఆయన వాషింగ్టన్ పర్యటన ఉంటుందని పేర్కొంది. కాగా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు భారత్, జపాన్ 15వ శిఖరాగ్ర సదస్సును నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. మోదీ-ఇషిబాలు ఇరు దేశాల భాగస్వామ్యం గురించి చర్చించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa