ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రొ కబడ్డీ లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 10:52 PM

విశాఖ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 29న రాత్రి విశాఖలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు భారత క్రికెట్‌ యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రమే అతడు విశాఖకు చేరుకున్నాడు. అతడికి నిర్వహకులు ప్రత్యేక స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.


కాగా వైభవ్ సూర్యవంశీ .. ప్రొ కబడ్డీ లీగ్ 12 సీజన్ ప్రారంభానికి ముందే.. కబడ్డీ మ్యాట్‌పై క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఆటగాళ్లతో కలిసి కాసేపి కబడ్డీ కూడా ఆడాడు. అనంతరం 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ చేతుల మీదుగా ఈవెంట్‌ లాంచ్‌ అయ్యింది. ఇక ఇదే కార్యక్రమంలో కబడ్డీ దిగ్గజం.. అభిమానులు డుబ్కీ కింగ్‌గా పిలుచుకునే పర్దీప్ నర్వాల్‌ను సన్మానించారు. ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే పర్దీప్ నర్వాల్‌ 1801 రైడ్‌ పాయింట్లు సాధించి.. అత్యధిక రైడ్‌ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.


కాగా వైభవ్‌ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్‌లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన.. అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.


మొత్తంగా ఐపీఎల్ 2025లో 7 ఇన్నింగ్స్‌లలో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 రన్స్ స్కోరు చేశాడు. ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్‌ రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను దక్కించుకుంది. ఇక పీకేఎల్ సీజన్ 12 తొలి మ్యాచ్‌లో తమిళ తలైవాస్ జట్టు తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. తమిళ తలైవాస్‌ 38 పాయింట్లు సాధించగా.. తెలుగు టైటాన్స్‌ 35 పాయింట్లకే పరిమితమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa