రియల్ మనీ గేమింగ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో భారత్లో క్రికెట్కు గడ్డు పరిస్థితులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భారత జట్టుకు స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 ఇటీవలే తన కాంట్రాక్ట్ను అర్ధంతరంగా రద్దు చేసుకుంది. దాంతో ఇప్పుడు టీమిండియా జెర్సీకి స్పాన్సర్ లేనట్టయింది. అయితే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు వేయాల్సి ఉండగా, సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే ఆసియా కప్కి స్పాన్సర్స్ అందే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.
రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన బీసీసీఐ అత్యవసర సమావేశం గురువారం జరిగింది. కొత్త స్పాన్సర్పై చర్చలు జరిగాయి గానీ, స్పష్టమైన టైమ్లైన్ మాత్రం నిర్ణయించలేదు. దాంతో ఆసియా కప్కి జెర్సీ స్పాన్సర్ లేకుండా భారత్ దిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టీమిండియా మ్యాచ్లు సెప్టెంబర్ 10 నుంచి మొదలవ్వనున్నాయి. సెప్టెంబర్ 14న భారత్ - పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే డ్రీమ్11తో బోర్డు సంబంధం ముగిసిందని కన్ఫార్మ్ చేశారు. కొత్త లీడ్ స్పాన్సర్ కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 2023 జూలైలో బైజూస్ స్థానంలో డ్రీమ్11, రూ.358 కోట్ల విలువైన మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా ఐపీఎల్లోనూ అనేక ఫ్రాంచైజీలతో భాగస్వామ్యం కొనసాగించింది. అయితే, ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు–2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడంతో డ్రీమ్11 తన ప్లాట్ఫారమ్లో అన్ని మనీ–బేస్డ్ గేమింగ్ కాంటెస్టులను నిలిపివేసింది.
“కొత్త చట్టం ప్రకారం డ్రీమ్11 లేదా అలాంటి ఇతర గేమింగ్ కంపెనీలతో బీసీసీఐకి ఒప్పందం కొనసాగించడం కష్టమే. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నాం” అని సైకియా వ్యాఖ్యానించారు. కాంట్రాక్టులో ప్రత్యేక నిబంధన ఉండటం వల్ల డ్రీమ్11పై ఎలాంటి జరిమానాలు విధించరని, ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంలో స్పాన్సర్ బీసీసీఐకి చెల్లించాల్సిన అవసరం ఉండదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa