పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు, ఎయిర్బేస్లే లక్ష్యంగా భారత్ చేపట్టిన దాడులతో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారు. పదే పదే భారత్పైకి ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని.. భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగి.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టి కేవలం దాడులు మాత్రమే కాకుండా.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్తాన్కు భారీ దెబ్బ కొట్టింది. అంతేకాకుండా అట్టారీ సరిహద్దును మూసివేసి.. భారత్లో ఉన్న పాక్ వాసుల వీసాలను రద్దు చేసి వెనక్కి పంపించేసింది.
ఈ క్రమంలోనే కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఇండియా టుడే-సీ ఓటర్.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు ఆపరేషన్ సిందూర్ను సమర్థించారు. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంచి నిర్ణయమేనని సర్వేలో పాల్గొన్న 55 శాతం మంది చెప్పారు. మరో 21 శాతం మంది మాత్రం ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకించారు. ఇంకో 15 శాతం మంది మాత్రం.. ఆపరేషన్ సిందూర్ సంతృప్తికరంగా లేదని.. పాకిస్తాన్ను మరింత ఎక్కువ కాలం శిక్షించాల్సి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జూలై 1వ తేదీ నుంచి ఆగస్ట్ 14వ తేదీ వరకు ఇండియా టుడే-సీ ఓటర్ ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను నిర్వహించింది. 54 వేల మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. దీంతో మొత్తం 2,06,826 మంది నుంచి ఆపరేషన్ సిందూర్ గురించి.. ఫీడ్బ్యాక్ తీసుకుని.. చివరికి సర్వే ఫలితాలను వెల్లడించింది.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక పర్యాటకులను అతిదారుణంగా కాల్చి చంపడం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. మే 7వ తేదీన పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో పాక్లోని ఉగ్రవాద కేంద్రాలు, పాక్ వైమానిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది.
ఆపరేషన్ సిందూర్లో హతమైన ఉగ్రవాదులు అంతా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందినవారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వారికి పాకిస్తాన్ సైన్యంతోపాటు ఐఎస్ఐ మద్దతు ఉందని వెల్లడించారు. మే 10వ తేదీన పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్.. భారత డీజీఎంఓను సంప్రదించి దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారని కేంద్రం తెలిపింది. మే 12వ తేదీన రెండు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన అధికారిక చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కానీ.. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగేందుకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa