అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వాణిజ్య విధానాలపై, ముఖ్యంగా భారత్పై విధించిన సుంకాలపై.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రపంచ వేదికపై అమెరికా ప్రతిష్ట దిగజారిందని, అమెరికా బ్రాండ్ టాయిలెట్లో పడిపోయిందంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 'అమెరికా ఫస్ట్' విధానం వల్ల స్నేహపూర్వక దేశాలను కూడా ట్రంప్ శత్రువులుగా మార్చుకున్నారని.. ఇది అమెరికాకే నష్టం చేకూర్చిందని సల్లివన్ స్పష్టం చేశారు.
ట్రంప్ సర్కారు భారత్ వంటి కీలక భాగస్వామ్య దేశాలపై విధించిన భారీ సుంకాల విధానం సరికాదని జేక్ సల్లివన్ పేర్కొన్నారు. ఇది అమెరికాకు ఒక పెద్ద లోపం అని, వాణిజ్యపరంగా భారత్ను దూరం చేసుకోవడం వల్ల చైనా వంటి దేశాలకు లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. భారత్ ఒక ముఖ్యమైన మార్కెట్తో పాటు వ్యూహాత్మక భాగస్వామి అని గుర్తు చేశారు. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో భారత్ సహకారం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. కానీ ట్రంప్ తన వ్యాపార విధానాలతో భారత్ను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తాజా వాణిజ్య గణాంకాలను ఉటంకిస్తూ.. అమెరికా వ్యాపార లోటు ట్రంప్ హయాంలో మరింత పెరిగిందని సల్లివన్ చెప్పారు. 'అమెరికాను తిరిగి గొప్పగా చేస్తాం' అంటూ ట్రంప్ చేసిన ప్రచారం కేవలం నినాదాలకే పరిమితం అయిందని అన్నారు. ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య యుద్ధం అమెరికాను మరింత బలహీనపరిచిందని, మిత్ర దేశాల నుంచి కూడా అమెరికాను వేరు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ విధానాల వల్ల అమెరికా ఒక ద్వీపంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని.. అది అమెరికా భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు నష్టం చేస్తుందని హెచ్చరించారు.
భారతీయ వస్తువులపై సుంకాలు విధించడం, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవడం వంటి నిర్ణయాలు కేవలం ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా కూడా అమెరికా ప్రతిష్టను దిగజార్చాయని సల్లివన్ విశ్లేషించారు. భారత్ లాంటి దేశాలు అమెరికాకు సహజ మిత్రులుగా ఉన్నాయని.. వారికి వాణిజ్యపరంగా లబ్ధి చేకూర్చడం ద్వారానే రాజకీయ, భద్రతా సంబంధాలను బలోపేతం చేయవచ్చని సల్లివన్ పేర్కొన్నారు. ట్రంప్ విధానాలు ఆ దిశకు విరుద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా బంధాలు మళ్లీ సత్సంబంధాల దిశగా మారుతున్నాయన్నారు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో బీజింగ్ కూడా భారత్తో మరింత లోతైన సహకారాన్ని కోరుకుంటోందని పేర్కొన్నారు.
ట్రంప్ విధానాలను జేక్ సల్లివన్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఉన్నత స్థాయి మాజీ అధికారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఒబామా హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన జాన్ కెర్రీ.. ట్రంప్ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "గొప్ప దేశాలు ప్రజలకు ఎల్లప్పుడూ అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. నిజమైన దౌత్య ప్రయత్నాలు ఉండాలి" అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa