ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధం: యూఎస్ కోర్టు సంచలన తీర్పు

international |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 09:57 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ సుంకాలపై అమెరికా అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధించిన ఈ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొంది. ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా ఈ సుంకాలు విధించారని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ సుంకాల వల్ల పలు దేశాలు ప్రభావితం అయ్యాయని కూడా వివరించింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. దీనిపై ట్రంప్ బృందం సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.


రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో అనేక వాణిజ్య విధానాలను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై, ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం వంటి వాటిపై భారీగా సుంకాలు విధించారు. ఈ సుంకాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాదిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై దేశీయ దిగుమతిదారులు, వ్యాపారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని, వినియోగదారులపై భారం మోపుతుందని వాదించారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వ్యాపార సంస్థలు అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాయి.


గత రెండు దశాబ్దాలుగా చైనా వంటి దేశాల నుంచి వస్తున్న చవక వస్తువుల వల్ల అమెరికాలోని ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు మూతపడ్డాయని.. ఈ పరిశ్రమలను కాపాడాలంటే దిగుమతులపై సుంకాలు విధించడం తప్ప మరో మార్గం లేదని ట్రంప్ వాదించారు. కానీ ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. టారిఫ్లను విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం, దాని పరిధిని కోర్టు విశ్లేషించింది. ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య విధానాలపై అధికారాన్ని దుర్వినియోగం చేసిందని కోర్టు నిర్ధారించింది. ఇది అమెరికా చట్టం సెక్షన్ 232కు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.


అయితే ప్రస్తుతానికి పెంచిన సుంకాలను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీం కోర్టులో పోరాడనున్నారు. ముఖ్యంగా ఈ తీర్పుపై స్పందిస్తూ.. కోర్టును విమర్శించారు. ఈమేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయన్నారు. వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు చెప్పిందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఇదో జాతీయ ముప్పు అవుతుందని ట్రంప్ వివరించారు. అమెరికా మరింత బలపడాలని.. కానీ అప్పీళ్ల కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలే సరైన మార్గం అని చెప్పుకొచ్చారు. యూఎస్ సుప్రీం కోర్టు సాయంతో టారిఫ్‌లను అమెరికా దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి.. దేశాన్ని బలమైన, ఆర్థిక, శక్తిమంతంగా మారుస్తానని స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో ట్రంప్ తన రాజకీయ జీవితంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. “ఈ తీర్పు దేశానికి ఒక పెద్ద విపత్తు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సుంకాలు అమెరికా పరిశ్రమలను రక్షించడంలో, ఉపాధిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని ఆయన వాదించారు. అయితే దిగుమతిదారులు, వ్యాపారులు ఈ తీర్పును ఒక చారిత్రక విజయం, తమ పోరాటానికి లభించిన న్యాయం అని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, ఈ న్యాయ పోరాటం అమెరికా రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరో కీలక పరిణామంగా నిలిచిపోయింది. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు అమెరికా వాణిజ్య భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa