గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని వరుస మరణాలు భయపెడుతున్నాయి. 5 నెలల వ్యవధిలో సుమారు 30 మంది చనిపోయారు. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం కాస్త వైద్యాధికారులకు తెలియడంతో.. ప్రస్తుతం వైద్య బృందాలు గ్రామంలో పర్యటిస్తున్నాయి. అలానే ఎపిడిమిక్ బృందంతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన వైద్యబృందం కూడా ప్రస్తుతం గ్రామంలో పర్యటిస్తోంది. మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లిన వైద్య బృందం.. బాధితు కుటుంబ సభ్యల నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఈ మరణాలకు కారణం దోమకాటా.. లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశోధిస్తున్నారు. బ్లడ్ టెస్ట్, నీటి పరీక్షల ఫలితాలు వస్తే.. ఈ వరుస మరణాలకు కారణం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ.. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి వారిని ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకుండా పోతుందని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. వరుస మరణాలకు కారణం తెలియక గ్రామాస్తులు భయపడుతున్నారు. అలానే గ్రామస్తులు చనిపోవడానికి కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియా కారణమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ సమస్య మీద దృష్టి సారించింది. సమస్యకు కారణాలు తెలుసుకునేందుకు శుక్ర, శని వారాల్లో.. ఎపిడిమిక్ సెల్ ద్వారా గ్రామంలో సర్వే నిర్వహించారు. అది ఇంకా కొనసాగుతుంది. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కలిసి.. ఎలా చనిపోయారు.. మృతి చెందడానికి ముందు వారు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా వ్యాధి అనుమానిత కుటుంబ సభ్యుల నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. అలానే గ్రామంలో మంచినీటి నమూనాలను కూడా సేకరించి టెస్ట్ చేస్తున్నారు.
అయితే చనిపోయిన వారిలో కొందరు దోమ కాటు వల్ల అనారోగ్యం బారిన పడ్డారని బాధిత కుటుంబ సభ్యుల తెలిపారు. దోమ కుట్టిన దగ్గర బొబ్బలు వచ్చాయని... అనంతరం వారు చనిపోయారని తెలిపారు. అలానే చనిపోయిన వారిలో కొందరికి చీప్ లిక్కర్ అలవాటు కూడా ఉందని తేలిసింది. చనిపోయిన వారిలో ఎవరి మీద అయిన దీని ప్రభావం ఏమైనా ఉందా అనే అంశాన్ని నిర్థారించాల్సి ఉంది. అయితే మరణాలకు వైర్స్, బ్యాక్టీరియా జ్వరాలు కారణం కాదని వైద్య బృందాలు తమ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది.
చనిపోయిన వారిలో పురుషులే అధికంగా ఉన్నారని తెలిపారు. ఇక వీరిలో 65 ఏళ్లు పైబడిన వారు ఆరుగురు ఉండగా.. మిగతా వారంతా 60 ఏళ్ల లోపే వారని తెలిపారు. ఈ మరణాలకు జీవనశైలి వ్యాధులు కూడా కారణమని కొందరు నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మరణాల మిస్టరీకి అసలైన కారణాలు ఏమిటో తెలియాల్సి ఉంది. రెండు రోజుల్లో రక్తనమూనాలు, నీటి నమూనాల పరీక్ష ఫలితాలు వైద్య ఆరోగ్య శాఖకు అందుతాయని తెలిసింది. ఇవి వస్తేనే మరణాల మిస్టరీ వీడేందుకు అవకాశం ఉంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa