పాకిస్థాన్లోలో వరదల వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓవైపు దేశాన్ని వరదలు ముంచెత్తుతుంటే.. మంత్రి అసాధారణ పరిష్కారాలు సూచించి తీవ్ర విమర్శల పాలయ్యారు. ముఖ్యంగా ప్రజలంతా వరద నీటిని ఒక వరంలా భావించాలని.. వాటిని ఇళ్లలోనే నిల్వ చేసుకోవాలని సూచించారు. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రజలతో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
పాకిస్థాన్లో పంజాబ్ ప్రావిన్స్లో ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి.. విధ్వంసం సృష్టించాయి. దీంతో వేలాది గ్రామాలు నీట మునిగాయి. పంటలు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక స్థానిక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. ఖవాజా ఆసిఫ్ షాకింగ్ కామెంట్లు చేశారు. “ప్రజలు ఈ నీటిని నిల్వ చేసుకోవాలి. రహదారులపై నిండిన వాటన్నింటినీ తీసుకెళ్లి ఏవైనా కంటైనర్లలో దాచుకోవాలి. ఈ నీరు మనకు ఒక వరంలా వచ్చింది. దానిని మనం నిల్వ చేసుకుని, ప్రయోజనం పొందాలి.” అని అన్నారు.
మరో సందర్భంలో భారతదేశంపై కూడా ఆయన విచిత్రమైన ఆరోపణలు చేశారు. భారత్ నుంచి వచ్చే వరద నీటితో పాటు "చనిపోయిన శవాలు" కూడా పాకిస్థాన్లోలోకి కొట్టుకు వస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని.. వరదల వల్ల దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వరదల వంటి జాతీయ విపత్తులను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఖవాజా ఆసిఫ్ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురిసిన క్షణంలో.. స్టేడియంలోని లైట్లను పాకిస్థాన్ హ్యాకర్లు ఆపేశారని అన్నారు. అలాగే వరదల సమయంలో భారత డ్యామ్ గేట్లను తమ సైబర్ యోధులు తెరిచారని చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు భారీగా ట్రోల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన వరదల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాక్ను నవ్వులపాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న ఒక మంత్రి ఇంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa