తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇలా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు డబ్బులు, బంగారం, వెండి వంటి కానుకలను హుండీలో వేస్తారు. మరికొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తారు. ఈ విరాళాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. తాజాగా మరో భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు.. పేదవారు, భక్తుల ప్రాణాలు కాపాడే కీలకమైన ప్రాణదాన ట్రస్టు కోసం ఇచ్చారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తారు.
తిరుమల శ్రీవారికి శశి విద్యాసంస్థల ఛైర్మన్ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు శశి విద్యాసంస్థల తరఫున రూ 1,01,11,111 విరాళం ఇచ్చారు. ఈ మేరకు శశి విద్యాసంస్థలు అధినేత బూరుగుపల్లి రవికుమార్ దంపతులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. విరాళం అందజేసిన దాత రవికుమార్ దంపతులను టీటీడీ ఛైర్మన్ అభినందించారు. అలాగే బుధవారం టీటీడీకి ఖరీదైన ఎలక్ట్రిక్ బస్సు విరాళంగా అందజేశారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం చేపట్టారు. అనంతరం జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధి నుందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, మాడ వీధులలో శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్లు, టిటిడి డిప్యూడీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో గురువారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.ఇందులో భాగంగా ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, బలిహరన, తీర్థ ప్రసాద గోష్టి, సంభావన, పవిత్ర వితరణ తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిస్తారు. ఇటు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగశాలలో పూర్ణాహుతి, పుణ్యాహవచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమములు జరిగాయి. అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం చతుష్టానార్చన, పూర్ణాహుతి జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa