మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీతూ పట్వారీ నివాసాన్నే లక్ష్యంగా చేసుకుని దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఐదుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు ఇండోర్లోని పట్వారీ నివాసంలోకి చొరబడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించినట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించింది. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇండోర్కు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ పరిస్థితి దారుణంగా ఉందని ఎక్స్ వేదికగా విమర్శించింది. రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.జీతూ పట్వారీపై ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ గుర్తు చేసింది. గతంలోనూ ఆయనపై వేర్వేరు ప్రాంతాల్లో ఐదుసార్లు దాడులు, ప్రమాదకర ఘటనలు జరిగాయని పేర్కొంది. ఆయనకు భద్రత కల్పించాలని తాము చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది.జీతూ పట్వారీ భద్రత విషయంలో డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని కాంగ్రెస్ సూచించింది. ఆయనకు తక్షణమే పటిష్టమైన భద్రత కల్పించాలని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa