ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన బీజేపీ వర్క్షాప్లో ఆయన తోటి పార్లమెంట్ సభ్యులతో పాటు చివరి వరుసలో కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలపై జరిగిన ఈ సమావేశంలో ఆయన ఒక సాధారణ ఎంపీలా పాల్గొన్నారు.ఈ వర్క్షాప్లో జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా బీజేపీ ఎంపీలందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో దేశ పరోక్ష పన్నుల విధానంలో సరికొత్త శకం మొదలైంది. ఈ మార్పుల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇకపై 5 శాతం, 18 శాతం అనే రెండు ప్రధాన పన్ను శ్లాబులు మాత్రమే ఉంటాయి. అయితే, సిన్ గూడ్స్ (హానికర ఉత్పత్తులు)పై 40 శాతం అధిక పన్ను వర్తిస్తుంది.ఈ సంస్కరణల ఫలితంగా పలు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. కిరాణా సరుకులు, బట్టలు, పాదరక్షలు, ఎరువులు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు వంటివి చౌకగా లభించనున్నాయి. గతంలో 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబుల్లో ఉన్న అనేక వస్తువులను ఈ రెండు కొత్త శ్లాబుల్లోకి మార్చడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ, మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ కింద ఉపశమనం కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ఈ సంస్కరణలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల ప్రజల చేతిలో డబ్బు మిగిలి, కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా వినియోగం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa