ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్ నిమజ్జన వేడుకలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 07:28 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణపతి శోభాయాత్ర, నిమజ్జనం వేడుకలు దాదాపుగా పూర్తికావొస్తున్నాయి. సెప్టెంబర్ 7, ఆదివారం మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో.. ఆలోపే విగ్రహాలను నిమజ్జనం చేయాలని భావించి.. త్వరత్వరగా కార్యక్రమం ముగించారు. తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. చాలా వరకు వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అయితే కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. పలువురు చనిపోయారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో చనిపోయిన వారికి ఉత్సవ కమిటీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ వివరాలు..


ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. అయితే నిమజ్జనం వేళ కొన్ని చోట్ల విషాదాలు చోటు చేసుకున్నాయి. వినాయకుడి శోభాయాత్ర, నిమజ్జనంలో భాగంగా పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. ఈ సంఘటలనపై ఉత్సవ కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. దీని గురించి ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గోకరాజు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.


 వినాయక నిమజ్జనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11 మంది చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది. అలానే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వినాయక మండపాలకు సింగిల్ విండో విధానం ద్వారా.. అనుమతులు మంజూరు చేయడం, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గాను ఉత్సవ కమిటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. వినాయక చవితి, నిమజ్జనోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వారు ధన్యవాదాలు తెలిపారు. భక్తులు తమ భద్రత గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.


తెలంగాణలో కూడా విషాదాలు..


గణేష్ శోభాయాత్ర, నిమజ్జన వేడుకల సందర్భంగా తెలంగాణలో కూడా పలుచోట్ల విషాదకర సంఘటనలు వెలుగు చూశాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న పోలీసు వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో వారు పూటుగా మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ చేసిన కారులో ఉన్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కశ్వి (20) అనే యువతి చనిపోయింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa