ఉత్తర ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పదేపదే అత్యాచారానికి గురైన ఒక 11 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు ఏడు నెలలు కాగా.. అకాల ప్రసవంతో ఒక శిశువుకు జన్మను ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ పసికందు పుట్టిన 30 నిమిషాలకే మరణించింది. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
ఈ అమానవీయ ఘటనకు కారణమైన 31 ఏళ్ల రషీద్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా రషీద్ ఆ బాలికపై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. నిందితుడు ఆమెను పండ్ల పేరుతో తన ఇంటికి పిలిచి అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియోగా తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది.
ఇదే అదునుగా చేసుకున్న రషీద్ పదే పదే బాలికను ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ముందుగా బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పగా.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలుసుకుని షాక్ అయ్యారు. అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పగా.. కన్నీటిపర్యంతం అయ్యారు. ఇదెలా సాధ్యమైందంటూనే గుండెలు బాదుకున్నారు. తమ చిన్నారి జీవితాన్ని కాపాడమని కోరారు.
ఈక్రమంలోనే వైద్యులు ఆ బాలికకు గర్భస్రావం చేయాలనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆ తరువాత వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోగా.. ఏడు నెలలకే ఆమె ఒక అకాల శిశువుకు జన్మను ఇచ్చింది. అయితే నెలలు నిండకముందే పుట్టడం వల్ల కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు రషీద్ గురించి తెలుసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేశారు.
ఈ దారుణమైన నేరానికి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పలు సామాజిక వర్గాలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శిశువు డీఎన్ఏ నమూనాలను సేకరించి, నిందితుడు రషీద్తో సరిపోల్చి తండ్రిని నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి పేరు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa