ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులు వదిలేసి అవి మాత్రమే చోరీ,,,పీసీసీ అధ్యక్షుడి ఇంట్లో దొంగల బీభత్సం

national |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 08:20 PM

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) జీతూ పట్వారీ ఇంట్లో జరిగిన చోరీ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఇండోర్‌ రాజేంద్ర నగర్‌లోని బిజల్‌పూర్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలోకి ఆరుగురి కంటే ఎక్కువ మంది దొంగలు చొరబడి బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


చోరులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదటగా ఆ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత బయట ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి.. లోపలికి ప్రవేశించినట్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఇంట్లో ఉన్న కార్యాలయంలోకి వెళ్లి అక్కడి డ్రాలు, లాకర్లను పగలగొట్టారు. అయితే ఈ చోరీ వెనుక ఉన్న ఉద్దేశంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దొంగలు ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను వదిలి పెట్టి.. కొన్ని సాధారణ వస్తువులను మాత్రమే తీసుకువెళ్లారు.


దీంతో కుటుంబ సభ్యులు సహా పోలీసులు అంతా షాక్ అవుతున్నారు. దీన్ని బట్టే ఇది సాధారణ చోరీ కాదనీ.. దీని వెనుక ఏదైనా పగ, రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దొంగలు ఏవైనా ముఖ్యమైన పత్రాల కోసం వెతికి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదే దొంగల ముఠా జీతూ పట్వారీ ఇంటితో పాటు సమీపంలో నివసిస్తున్న చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ (సీఎంఓ) రాజ్ కుమార్ ఠాకూర్, మధ్య ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (ఎంపీఈబీ) ఆఫీసర్ నరేంద్ర దూబే ఇళ్లలో కూడా చొరబడ్డారు. అక్కడ కూడా విలువైన వస్తువులు వదిలేసి సాధారణ వస్తువులను మాత్రమే దొంగిలించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఈ దొంగలు మాస్కులు ధరించి ఉన్నప్పటికీ.. పట్వారీ ఇంటి వెలుపల ఉన్న సీసీ కెమెరాల్లో వారి కదలికలు రికార్డయ్యాయి.


సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకోవాలని..


ఈ ఘటనతో బిజల్‌పూర్‌లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల ఇళ్లే సురక్షితం కానప్పుడు.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అనుమానాస్పద చోరీ కేసులో అసలు నిజాలు బయటపడాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa