ఇటీవల కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) జీఎస్టీ శ్లాబులు 4 ఉండగా.. వాటిని 2 శ్లాబులకు కుదించారు. అదే సమయంలో సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసరాల వస్తువులపై పన్నులు తగ్గించడంతో.. భారీ ఊరట లభించినట్లయింది. అయితే జీఎస్టీ అమల్లోకి తీసుకువచ్చినపుడు 4 శ్లాబులు తెచ్చి.. ఇప్పుడు వాటిని 2 శ్లాబులకు తగ్గించి.. దేశ ప్రజలకు బీజేపీ ఏదో మేలు చేసినట్లు చెబుతోందని కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు గత కొన్ని రోజులుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. జీఎస్టీ శ్లాబుల నిర్ణయం.. కేవలం బీజేపీది మాత్రమే కాదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్షాలు దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకువచ్చినపుడు 4 స్లాబులు ఉండాలని తీసుకున్న నిర్ణయం కేవలం బీజేపీదో లేక అప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీదో కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీ తీసుకున్నదేనని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారత కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారనే విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ఈ విషయం ప్రతిపక్షాలకు తెలియకపోవడం ఏంటని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తాను చెప్పింది తప్పని ప్రతిపక్ష నాయకులు ఎవరైనా నిరూపిస్తే తాను క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమైనని తేల్చి చెప్పారు. తనకు ఎలాంటి బేషజాలు లేవని.. తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమేనని.. కానీ ప్రతిపక్షాలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై అవగాహన లేకపోతే కనీసం మౌనంగానైనా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు నిర్మలా సీతారామన్ చురకలు అంటించారు.
గతంలో జీఎస్టీ ప్రవేశపెట్టినపుడు.. అందులో 4 శ్లాబులు తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ సహా దేశంలోని పలు విపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే గత వారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రెండు శ్లాబులకు ఆమోదం కల్పించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ 2 శ్లాబులు అమల్లోకి రానున్నాయి. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబ్లు ఉండగా.. ప్రస్తుతం 12 శాతం, 28 శాతం శ్లాబ్లను తొలగించారు. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, పొగాకు, సిగరెట్లపై కొత్తగా 40 శాతం పన్నులు విధిస్తూ కొత్త శ్లాబ్ తీసుకువచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa