నేపాల్ లో అవినీతి వ్యతిరేక ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రాజధాని ఖాట్మండుతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని, ఉద్యమం మాటున దోపిడీలకు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయని నేపాల్ ఆర్మీ పేర్కొంది. దేశంలో ప్రభుత్వం కుప్పకూలడంతో పాలనా పగ్గాలు చేపట్టిన ఆర్మీ తాజాగా ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించింది. ఈ విషయంపై చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ తాజాగా టీవీల్లో ప్రసంగించారు. ‘ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. ఉద్యమం మాటున దోపిడీలకు, దాడులకు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షిస్తాం. ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ మేరకు దేశాధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేశారు. ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. సామాన్యుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలి. ఆందోళనలను విరమించి నిరసనకారులు చర్చలకు రావాలి’ అని జనరల్ అశోక్ రాజ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa