నెలకు కేవలం పదివేల రూపాయల జీతంతో ఓ ధాబాలో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తన ప్రమేయం లేకుండానే తన పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు రావడంతో అతడు హతాశుడయ్యాడు. ఈ భారీ మోసం మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాకు చెందిన రవీంద్ర సింగ్ చౌహాన్ జీవితాన్ని తలకిందులు చేసింది.భింద్ నివాసి అయిన రవీంద్ర ప్రస్తుతం గ్వాలియర్లోని ఓ ధాబాలో పనిచేస్తున్నాడు. 2017లో మెహ్రా టోల్ ప్లాజాలో పనిచేస్తున్నప్పుడు అతనికి శశి భూషణ్ రాయ్ అనే సూపర్వైజర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో 2019లో రవీంద్రను ఢిల్లీకి తీసుకెళ్లిన రాయ్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు ఈ ఖాతాలో జమ అవుతాయని నమ్మించి అతడి పేరు మీద ఓ బ్యాంకు ఖాతా తెరిపించాడు. ఆ తర్వాత రవీంద్ర ఆ ఖాతా గురించి పూర్తిగా మర్చిపోయి తన పనుల్లో నిమగ్నమయ్యాడు.అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో రవీంద్ర స్వగ్రామంలోని చిరునామాకు ఐటీ శాఖ నుంచి మొదటి నోటీసు వచ్చింది. అది ఇంగ్లిషులో ఉండటంతో కుటుంబ సభ్యులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. జులైలో రెండోసారి నోటీసు రావడంతో వారు రవీంద్రకు సమాచారం అందించారు. దీంతో ఆందోళనకు గురైన రవీంద్ర అప్పుడు తాను పనిచేస్తున్న పూణెలోని ఉద్యోగాన్ని వదిలేసి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. గ్వాలియర్లోని న్యాయవాది ప్రద్యుమ్న్ సింగ్ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. రవీంద్ర పేరు మీద ఉన్న ఖాతా ద్వారా రూ.40.18 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలియగానే అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది.ఈ మోసంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా, ఖాతా తెరిచిన ఢిల్లీ బ్రాంచ్కు వెళ్లాలని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించారు. న్యాయవాది ప్రద్యుమ్న్ సింగ్ ప్రకారం నిందితుడు శశి భూషణ్ రాయ్.. రవీంద్ర పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి 'శౌర్య ఇంటర్నేషనల్ ట్రేడర్స్' అనే సంస్థను సృష్టించాడు. ఈ కంపెనీ పేరుతోనే 2023 వరకు ఈ భారీ లావాదేవీలు జరిపారు. ప్రస్తుతం ఆ ఖాతాలో ఇంకా రూ.12.5 లక్షలు ఉన్నట్లు తెలిసింది."ఇది నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు పన్నిన పన్నాగంలా ఉంది. ఏమీ తెలియని ఓ పేద వంటవాడిని ఈ కేసులోకి లాగారు" అని లాయర్ ప్రద్యుమ్న్ సింగ్ తెలిపారు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో బాధితుడు రవీంద్ర సింగ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. "పోలీసులు నా ఫిర్యాదు తీసుకోలేదు. ఎవరూ సాయం చేయలేదు. కోర్టులోనే పోరాడటం తప్ప నాకు వేరే దారి లేదు" అని రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa