ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని విషయం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో గత వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి విఫలమైంది. అయితే, ఇప్పుడు పార్టీ వైఖరి మార్చుకుని, మూడు రాజధానుల ఆలోచన లేదని, అమరావతినే అభివృద్ధి చేస్తామని స్పష్టం చేస్తోంది. ఈ మలుపుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజా వ్యాఖ్యలు పార్టీ స్థానానికి అద్దం పట్టేలా ఉన్నాయి. తాము ఎప్పుడూ అమరావతి రాజధాని కాదని చెప్పలేదని, కానీ దాని అభివృద్ధికి అధికార పార్టీ ప్రజాధనాన్ని వృధా చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రకటించారని, ఇందులో 52 వేల కోట్ల అప్పులు ఉన్నాయని అంబటి రాంబాబు ఆక్షేపించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే రాజధాని అవసరాలు సరిపోతాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేవలం 500 కోట్ల రూపాయలతో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు, కానీ వాటికి నిధులు కేటాయించడం కష్టమని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని పేరిట వేలాది కోట్ల అప్పులు తెచ్చి పెట్టడం సరైనదేనా? ఉన్న ప్రాంతాలను రాజధానులుగా ఎంపిక చేసుకుంటారా లేక కొత్తగా సృష్టిస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి పేరిట లక్షల ఎకరాల భూములు సేకరించడం ఎలా సాధ్యమని కూడా ఆయన అడిగారు.
హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు నిర్మించినా, వాటి చుట్టూ రాజధాని సహజంగా అభివృద్ధి చెందుతుందని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే వనరులు లేక ఇబ్బంది పడుతుంటే, లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని చెప్పారు. కొత్తగా వేసిన హైవే రోడ్లు కూడా తవ్వకపోతే నీరు బయటకు పోలేదని, ఇది అమరావతి లోతట్టు ప్రాంతమో మరో విధంగా లోపాలో ఉందో స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలు రాష్ట్ర ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.
చంద్రబాబు అమరావతిని ఒక ఏటిఎంగా మార్చుకున్నారని, మెబిలైజేషన్ అడ్వాన్సుల్లో కమీషన్లు దండుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ మూడున్నర ఏళ్లు కాదు, ముప్పై ఏళ్లు అయినా చంద్రబాబు చెప్పే హంగులతో కూడిన అమరావతి పూర్తి కాదని, ఇది ఆయన అతిపెద్ద తప్పిదమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. వైసీపీ ఈ అంశంలో పూర్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ, రాజధాని అభివృద్ధి విషయంలో ప్రజల అభిప్రాయాలు మరింత పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ వైఖరి మార్పు రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa