రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యమని, ఇందుకోసం ఒక స్పష్టమైన, బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. 2034 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 57 లక్షల కోట్లకు, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని రూ. 10.55 లక్షలకు చేర్చడమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 'వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ఆయన, 'స్వర్ణాంధ్ర-2047' విజన్ను ఆవిష్కరించి, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "కేవలం విజన్ రూపొందించడంతోనే సరిపెట్టకుండా, దాన్ని ఆచరణలో సాధ్యం చేసే దిశగా పనిచేయాలి. జాతీయ స్థాయిలో 'వికసిత్ భారత్-2047'కు అనుగుణంగా రాష్ట్రంలో 'స్వర్ణాంధ్ర-2047' విజన్ను సిద్ధం చేశాం. ఈ లక్ష్యాలను సాధించడం అసాధ్యమేమీ కాదు. కచ్చితమైన ఆలోచన, బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే" అని అన్నారు. రాష్ట్రంలోని భాగస్వాములందరినీ కలుపుకొని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు.రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన నిర్దిష్ట లక్ష్యాలను ఆయన ప్రజల ముందుంచారు. "ఈ ఏడాది, గత ఏడాది రెండంకెల వృద్ధి సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో 2028-29 నాటికి రాష్ట్ర జీఎస్డీపీని రూ. 29.29 లక్షల కోట్లకు, తలసరి ఆదాయాన్ని రూ. 5.42 లక్షలకు చేరుస్తాం. ఆ తర్వాత, 2034 నాటికి జీఎస్డీపీని రూ. 57.21 లక్షల కోట్లకు, తలసరి ఆదాయాన్ని రూ. 10.55 లక్షలకు పెంచేలా ప్రణాళికలు రూపొందించాం. ఈ మెగా డ్రీమ్ను నిజం చేసే బాధ్యతను ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది" అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "ఒకప్పుడు భారతీయులకు ప్రపంచంలో సరైన గుర్తింపు లేని సమయంలో, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా చేపట్టిన సంస్కరణలతో దేశ ప్రగతి పరుగులు పెట్టింది. 2038 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్-1 స్థానానికి చేరుకుంటుంది. ఇందులో తెలుగువారి పాత్ర కీలకంగా ఉండాలి" అని ఆకాంక్షించారు. తాను గతంలో అమలు చేసిన విజన్ 2020 సాకారమైన తర్వాత కూడా ఇంకా కొందరు అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు.సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు. "భారత్ లాంటి దేశంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాలి. సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, సంపద సృష్టి ద్వారా అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయిస్తాం. నేను కేవలం రాజకీయాల గురించే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి చెందేది కాదు, విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నాం. సంపద సృష్టించి, దాన్ని పేదలకు పంచుతున్నాం" అని వివరించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధాని అవుతారని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa