ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలనలో వేగం పెంచాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 08:11 AM

పరిపాలనలో వేగాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని, మంత్రివర్గ బృందం ఈ దిశగా సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలన సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఈ దశలో అలసత్వానికి తావులేదని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన పాలనకు సంబంధించిన పలు కీలక సూచనలు చేశారు.అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, మంత్రులు సమష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి వివరించినట్లు తెలిపారు. "కొన్ని జిల్లాల్లో స్థూల రాష్ట్రీయోత్పత్తి  పెరుగుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోంది. ఈ ఆర్థిక అసమానతలను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది" అని చంద్రబాబు అన్నారు. పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు అమరావతిలోని సీఆర్డీఏ భవనంలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు నూతన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇకపై సమావేశాల్లో సుదీర్ఘమైన ప్రజెంటేషన్లు వద్దని, సూటిగా, స్పష్టంగా చెప్పాలనుకున్నది వివరించాలని మంత్రులకు ఆయన హితవు పలికారు. కలెక్టర్ల సమావేశంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా తెలియజేయాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa