ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్‌లో లక్షన్నర మందితో వలస వ్యతిరేక ర్యాలీ: పోలీసులపై దాడి, 26 మందికి గాయాలు

international |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:57 PM

లండన్‌లో ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన భారీ వలస వ్యతిరేక ర్యాలీ హింసాత్మకంగా మారింది. "యునైట్ ది కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్" పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసుల అంచనా ప్రకారం 1,10,000 నుంచి 1,50,000 మంది వరకు ప్రజలు పాల్గొన్నారు. అయితే వారిని అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసుల.. నిరసనకారులతో గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు.. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మొత్తంగా 26 మందిని గాయపరిచారు.


వీరిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారికి దంతాలు విరిగిపోవడం, మెదడుకు గాయం, ముక్కు ఎముక విరగడం, వెన్నెముకకు గాయం వంటివి అయినట్లు పోలీసులు వెల్లడించారు. హింస, దాడి, నేరపూరిత విధ్వంసంతో సహా పలు నేరాలకు పాల్పడినందుకు కనీసం 25 మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.


ర్యాలీలో పాల్గొన్న కొద్దిమంది నిరసనకారులు.. వారిని వేరు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో తన్నినట్లు, బాటిల్స్ విసిరినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. "చట్టబద్ధంగా నిరసన తెలియజేయడానికి చాలామంది వచ్చినా, హింసను ప్రేరేపించాలనే ఉద్దేశంతో వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు" అని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ అన్నారు. నిరసనకారులు బలవంతంగా పోలీసుల కంచెలను దాటడానికి ప్రయత్నించారని తెలిపారు.


ఈ ర్యాలీని వాక్ స్వాతంత్ర్యానికి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే యూరప్‌కు చెందిన పలువురు ఫార్-రైట్ రాజకీయ నాయకులు.. వలసల వల్ల ఎదురవుతున్న సమస్యలపై ప్రధానంగా ప్రసంగించారు. ఫ్రాన్స్ రాజకీయ నాయకుడు ఎరిక్ జెమూర్.. "మన యూరోపియన్ ప్రజల స్థానాన్ని దక్షిణ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఆక్రమించుకుంటున్నారు" అని అన్నారు. అలాగే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ.. అనియంత్రిత వలసల వల్ల బ్రిటన్ నాశనం అవుతోందని అభిప్రాయపడ్డారు.


ర్యాలీలో పాల్గొన్నవారు ఇంగ్లాండ్ జెండా, బ్రిటన్ జెండానలను పట్టుకుని "మా దేశం మాకు తిరిగి కావాలి" అని నినాదాలు చేశారు. "పడవలను ఆపండి," "వారిని ఇంటికి పంపండి" వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ర్యాలీకి వ్యతిరేకంగా 'మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం' పేరుతో మరో చిన్న ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ నిరసనలు అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చకు కారమం అవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్లో జరుగుతున్న చర్చను మరింత తీవ్రతరం చేశాయి. ఈ ఘటనలు దేశంలో ఉన్న లోతైన విభేదాలను, ఉద్రిక్తతలను మరోసారి వెలికితీశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa