ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, అమెరికా మధ్య మంగళవారం నుంచి వాణిజ్య చర్చలు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:27 PM

ఒకవైపు భారీ టారిఫ్‌లతో అమెరికా ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కీలక చర్చలు జరగనున్నాయి. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తదుపరి దశ చర్చల కోసం అమెరికా ముఖ్య ప్రతినిధి సోమవారం రాత్రి భారత్‌కు చేరుకోనున్నారు. చర్చలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.ఈ చర్చల్లో అమెరికా తరఫున దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ పాల్గొననుండగా, భారత్ తరఫున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రాతినిధ్యం వహించనున్నారు. తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ, కొన్ని అంశాల్లో పురోగతి సాధించాల్సి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ, డెయిరీ రంగాలను విదేశీ పోటీకి అందుబాటులో ఉంచాలన్న అమెరికా డిమాండ్‌పై భారత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యధిక జనాభాకు జీవనాధారమైన ఈ రంగాలు సున్నితమైనవని వారు స్పష్టం చేస్తున్నారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న 'రెసిప్రోకల్ టారిఫ్' విధానం ఈ చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తొలుత భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు కొనసాగించడాన్ని కారణంగా చూపుతూ వాటిని 50 శాతానికి పెంచారు. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి.ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య కూడా ఇరు దేశాల అధినేతలు సానుకూల దృక్పథంతో మాట్లాడటం గమనార్హం. తమ సంబంధాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. "అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాలను నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. భారత్-అమెరికా మధ్య సానుకూలమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది" అని మోదీ 'ఎక్స్'లో పేర్కొన్నారు. మరోవైపు, ట్రంప్ కూడా భారత్-యూఎస్ బంధాన్ని "చాలా ప్రత్యేకమైనది" అని అభివర్ణించారని, తాము ఎప్పటికీ మిత్రులుగా ఉంటామని, "ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు" అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa