ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం విషయంలో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పదేపదే గడువు కోరుతున్న శాసనమండలి ఛైర్మన్ తరఫు న్యాయవాదికి న్యాయస్థానం షాకిచ్చింది. మరింత సమయం కావాలంటే ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఈ పిటిషన్పై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు సమయం ఇచ్చినా, కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యం చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ గడువు కోరడంతో, బుధవారం సాయంత్రం 5 గంటలలోపు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.10 వేలు చెల్లించాలని ఛైర్మన్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.కేసు వివరాల్లోకి వెళితే... జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే కారణంతో 2024 నవంబర్లో ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కె. మోషేన్ రాజుకు స్వయంగా అందజేశారు.అయితే, నెలలు గడుస్తున్నా తన రాజీనామాను ఛైర్మన్ ఆమోదించకపోవడంతో, దానిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగానే ఛైర్మన్ తరఫు న్యాయవాది పదేపదే సమయం కోరడంతో న్యాయస్థానం పై విధంగా స్పందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa