ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడిపిస్తున్నారని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. లా అండ్ ఆర్డర్పై కఠినంగా ఉంటామని మీడియా ముందు చెబుతున్న చంద్రబాబు, ఆచరణలో మాత్రం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.చంద్రబాబు 2047 విజన్ అంటూ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "2020 అన్నారు, ఇప్పుడు 2047 అంటున్నారు. రెండు తరాలు మారితే గానీ 2047 రాదు. మాటలు మార్చడం తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి శూన్యం. హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చెప్పుకుంటారు, కానీ బెంగళూరు అభివృద్ధి గురించి అక్కడి నేతలు ఎప్పుడూ అలా గొప్పలు చెప్పుకోరు. మహానగరాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి" అని ఆయన చురకలంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని, నాలుగు లక్షల పెన్షన్లను తొలగించిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. "ఆరోగ్యశ్రీకి రూ. 2,500 కోట్లు బకాయిలు పెట్టారు. దీంతో ఆసుపత్రుల్లో ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. పేదలు ఆసుపత్రుల వెలుపల పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా?" అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa