దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనాత్మక సంవత్సరమని, ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన మహా పోరాటంలో గెలిచిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన ‘సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా చంద్రబాబు 1984 నాటి రాజకీయ సంక్షోభాన్ని గుర్తుచేసుకున్నారు. “ఆనాడు ప్రజాస్వామ్యానికి జరిగిన ద్రోహంపై ప్రజలు తిరగబడ్డారు. 161 మంది ఎమ్మెల్యేలను రామకృష్ణ స్టూడియోకు తరలించి క్యాంపు నిర్వహించాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఎమ్మెల్యేలను సమీకరించడంలో ఇంద్రసేనారెడ్డి కీలక పాత్ర పోషించారు” అని చంద్రబాబు వివరించారు. దశాబ్దాలుగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గట్టి గుణపాఠం నేర్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.‘సజీవ చరిత్ర’ పుస్తకం ద్వారా 1984లో జరిగిన వాస్తవాలు నేటి తరానికి తెలుస్తాయని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ఈ పుస్తకం ఒక చారిత్రక దాఖలాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోరాటం దేశవ్యాప్తంగా ప్రభావం చూపిందని, ఆ స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa