ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామం కేసులో మరో కీలక మలుపుగా మారింది.మద్యం స్కామ్కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ విచారణకు అనుమతించాలని సిట్ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం, సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఆయన లొంగిపోయారు.మరోవైపు, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ విశ్రాంత అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించలేదు. కాగా, ఈ కుంభకోణంలో భాగంగా ఇప్పటికే భారీ మొత్తంలో నగదు, ఆస్తులను అధికారులు జప్తు చేశారు. సిట్ పిటిషన్పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa