ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు)పై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై ఇప్పటి వరకూ పార్టీ గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక, గుర్తులతో పాటు పోటీచేసే అభ్యర్థుల కలర్ ఫోటోలను కూడా ఉంచనున్నట్టు బుధవారం తెలిపింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలను ముద్రించడం వల్ల ఓటర్లకు మరింత స్పష్టం వస్తుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే జరగనున్న బిహార్ శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈసీ ప్రకారం.. ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోను ఉంచనున్నారు. ‘ఎన్నికల ప్రక్రియలను మరింత సులభతరం, పారదర్శకం కోసం, ఓటర్ల సౌలభ్యాన్ని మరింత పెంచడానికి గత 6 నెలల్లో తీసుకున్న 28 సంస్కరణల సరసన ఇది నిలుస్తుంది’ అని ఈసీ తన ప్రకటనలో వెల్లడించింది.
ఈవీఎంలపై పోటీచేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, పేర్లు ఒకే రకమైన ఫాంట్ టైప్లో, పెద్ద అక్షరాలలో ముద్రించినున్నారు. తద్వారా ఓటర్లు సులభంగా చదవగలిగేలా ఉంటుంది. అలాగే, ఈవీఎం బ్యాలెట్ 70 జీఎస్ఎం పేపర్పై ముద్రించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పింక్ కలర్ పేపర్ (నిర్దిష్ట RGB విలువలతో), ఈ అప్గ్రేడ్ చేసిన బ్యాలెట్ పేపర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో మొదలవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
కాగా, ఈవీఎంలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంతేకాదు, బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని, పలు రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనేది విపక్షాల వాదన. దీనిపై రాహుల్ గాంధీ బిహార్లో ‘ఓటు చోరీ యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే.
మరోవైపు, బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టవిరుద్దమని నిర్దారణ అయితే.. రద్దుచేస్తామని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఇదే సమయంలో ఓటర్ నమోదుకు ఆధార్ కార్డును కూడా 12వ పత్రంగా తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. వచ్చే నెల 7న ఈ అంశంపై చివర విచారణ జరిపి, కేసును ముగిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ అంశంపై తాము ఇచ్చే తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుందని తేల్చిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa