భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మౌలానా మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైందని జైషే మహమ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. పాకిస్థాన్ను మన సైనికులు మోకరిల్లేలా చేశారని ప్రదాని కొనియాడారు. మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన తన 75వ జన్మదినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మే 7న భారత సైన్యం జరిపిన దాడిలో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని జైషే మహమ్మద్ కమాండర్ వీడియోలో చెప్పాడు.. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ ఒక్కక్షణంలో మోకరిల్లింది’’ అని అన్నారు.
‘‘ నిన్ననే దేశం, ప్రపంచం మరోసారి చూసింది.. ఒక పాకిస్థానీ ఉగ్రవాది ఏడుస్తూ తన పరిస్థితి చెప్పాడు.. ఇది నూతన భారత్. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు… శత్రువు గూటిలోకి దూసుకెళ్లి దెబ్బతీస్తుంది’’ అని మోదీ పునరుద్ఘాటించారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మసూద్ కుటుంబం చిన్నాభిన్నమైందని ఇలియాస్ కశ్మీర్ వ్యాఖ్యానించాడు.
‘‘భరతమాత భద్రతకు దేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది.. మన సోదరీమణులు, కుమార్తెల నుదుట సిందూరాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు తుడిచేశారు.. ఆపరేషన్ సిందూర్తో మనం ఉగ్రవాద శిభిరాలను ధ్వంసం చేశాం.. ధైర్యవంతులైన మన సైనిక దళాలు రెప్పపాటులో పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
గతవారం బహావల్పూర్ సమీపంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ పాల్గొని.. భారత్ సైన్యం ఆపరేషన్లో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ‘దేశం కోసం మేము ఉగ్రవాదాన్ని స్వీకరించి, సరిహద్దులను రక్షించుకోడానికి ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడుతున్నాం.. కానీ, అన్నింటినీ త్యాగం చేసిన తర్వాత మే 7న మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని భారత సైన్యం చిన్నాభిన్నం చేసింది’అని కశ్మీరీ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7 తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa