ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవ భూముల కుంభకోణంపై స్పందిస్తూ, ఈ వ్యవహారంపై విజిలెన్స్ శాఖ జరిపిన విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన ఇళ్లకు కేటాయించిన భూముల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్న మంత్రి పార్థసారథి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వివరాలు ఇచ్చారు. కార్యక్రమం గడువు మేరకు పూర్తి కావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పథకానికి అనుగుణంగా అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, సొంత భూమి ఉన్న పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా సొంత భూమి ఉన్నవారికీ పథకం ప్రయోజనం అందేలా చూస్తామన్నారు.
అలాగే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయని, అవి వినియోగం లేకుండా ఉండిపోతున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి సమాధానమిస్తూ, వివిధ ప్రాంతాల్లో భూముల పరిశీలన జరుగుతోందని, అవసరమైన మార్పులు, నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa