ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ పుస్తకాల్లో ఆపరేషన్ సిందూర్ పాఠాలు, అన్నీ అబద్ధాలే

international |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 09:49 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాకిస్తాన్ ‌పై క్షిపణుల వర్షం కురిపించిన విషయం ప్రపంచ దేశాలకు తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి.. మే నెలలో ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. భారత సైన్యం చేసిన దాడులకు విలవిలలాడిపోయిన పాకిస్తాన్.. దాడులు ఆపాలంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో పాకిస్తాన్‌పై దాడులను భారత్ ఆపేసింది. అయితే పాక్ మాత్రం.. భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ.. గంభీరాలు మాత్రం తగ్గించుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్‌లో భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని.. భారత్‌లోని చాలా ప్రాంతాల్లో దాడులు చేసి ధ్వంసం చేశామని.. పదే పదే అసత్య ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రపంచ దేశాలు.. వినడం లేదు.


ఇక సొంత దేశం నుంచే పాక్ సర్కార్, ఆర్మీ తీరుపై తీవ్ర వ్యతిరేకత రావడం గమనార్హం. అయినా బుద్ధి మార్చుకోని.. పాక్ మరో దుస్సాహసానికి తెరలేపింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌పై తామే విజయం సాధించామని.. ఏకంగా పాఠ్యపుస్తకాల్లో ప్రింట్ చేయించింది. మొదట భారత్‌ ఘర్షణను ప్రారంభించిందని.. ఈ దాడుల్లో భారత వైమానిక స్థావరాలను పాకిస్తాన్ సైన్యం ధ్వంసం చేసినట్లు.. పాకిస్తాన్ పాఠ్యపుస్తకాల్లో తాజాగా కొత్త పాఠాలను చేర్చింది. అంతేకాకుండా ఈ యుద్ధంలో భారత్‌పై పాకిస్తాన్ గెలిచిందని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో పాక్ చెప్పిన అసత్యాలు.. అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.


పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసి.. తమ దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని అసత్యాలు ప్రింట్ చేసింది. అయితే అసలు నిజం ఏంటంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదులు చేసిన ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. దీంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది.


భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ప్రతిదాడులు చేసింది. కేవలం భారత్‌లోని మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పాక్ తెలిపింది. కానీ వాస్తవం ఏంటంటే.. పాకిస్తాన్ సైన్యం అమృత్‌సర్, జమ్మూ, శ్రీనగర్ సహా కీలక నగరాల్లోని పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడింది. అయితే పాక్ దాడులకు ధీటుగా స్పందించిన భారత్.. లాహోర్‌లోని పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.


భారత్‌లోని సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం పేర్కొంటోంది. కానీ నిజం ఏంటంటే.. మురిద్కే, నూర్ ఖాన్, రఫీకి, సర్‌గోధా, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్ వంటి పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసింది. ఇక పాక్ చేసిన దాడుల్లో భారత వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని ఇప్పటికే శాటిలైట్ ఫోటోలతో సహా భారత సైన్యం రుజువులను చూపించింది.


ఈ దాడుల్లో భారత్ భారీగా నష్టాలను చవిచూసిందని.. ఆ తర్వాత శాంతిని కోరిందని పాకిస్తాన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని పాఠ్యపుస్తకాల్లో అబద్ధాలను చేర్చింది. అసలు నిజం ఏంటంటే.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్‌పై కాల్పుల విరమణ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. అయితే భారత్ ఎవరి మధ్యవర్తిత్వం కోరదని.. పాకిస్తాన్ దాడులు ఆపకపోతే మరింత గట్టిగా బదులిస్తామని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ దాడులను ఆపేందుకు సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు తెలిపారు. అనంతరం భారత్, పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులు నేరుగా చర్చించి కాల్పుల విరమణకు అంగీకరించారు.


ఇక భారత్ చేసిన దాడుల్లో ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టింది. ఈ చర్య వల్ల భారత్‌తో చేసిన యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించినట్లుగా తమ దేశ ప్రజలను నమ్మించాలని ప్రయత్నాలు చేసినా అవి అంత సఫలం కాలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa