ఓ ఉద్యోగి ఆలయానికి వచ్చిన భక్తురాలితో అసభ్యకరంగా ప్రవర్తించి దెబ్బలు తిన్నాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నంకు చెందిన ఓ కుటుంబం సోమవారం సాయంత్రం చిన వెంకన్న దర్శనం కోసం ద్వారకాతిరుమల వచ్చారు. వారు టీటీడీ సదనంలో గది అద్దెకు తీసుకున్నారు. సత్రంలో గుమస్తాగా పనిచేస్తున్న నారాయణ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి వారితో పరిచయం పెంచుకున్నాడు.
ఆ కుటుంబంలోని ఓ మహిళకు జ్వరం రావడంతో, మరుసటి రోజు విధులకు వచ్చిన ఉద్యోగి ఆమెను పలకరించాడు. "జ్వరం తగ్గిందా?" అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆమె, ఉద్యోగిని కొట్టారు.. ఆ తరువాత ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడిని చితకబాదారు. వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు, ఉద్యోగి చేయి పట్టుకున్నది నిజమేనని నిర్ధారించారు. ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి వెంటనే స్పందించి, ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఇటీవల ఆలయంలో గదులకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఓ ఉద్యోగిని సస్పెండ్ చేయగా.. మరో ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు. తాజాగా మరో ఉద్యోగిని తొలగించడం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa