ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29 స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్నులు.. అవాక్కైన డాక్టర్లు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 08:39 PM

కొంత మంది చేసే పనులు చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక సరదా కోసం, కోపం, అసహనంతో చేసిన కొన్ని పనులు.. ప్రాణాల మీదికి తీసుకువస్తాయి. డీ అడిక్షన్ సెంటర్‌‌లో ఉన్న ఓ వ్యక్తి.. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అది తీవ్రం కావడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడి కడుపులో ఉన్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. స్పూన్లు, పెన్నులు, బ్రష్‌లు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి.. వాటన్నింటినీ కడుపులో నుంచి తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. డీ అడిక్షన్ సెంటర్‌లో ఉన్నప్పుడే అతడు వాటన్నింటినీ మింగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఉత్తర్‌‍ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


హాపూర్‌ జిల్లాలోని ఓ ఆస్పత్రికి కడుపు నొప్పితో వచ్చిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు సర్జరీ ద్వారా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్నులు సహా మొత్తంగా 50కి పైగా వస్తువులను బయటికి తీశారు. బులంద్ షహర్‌ జిల్లాకు చెందిన ఆ వ్యక్తిని.. ఒక నెల రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. ఆ డీ అడిక్షన్ సెంటర్‌లో చేరినప్పటి నుంచి.. అతడు తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన అతని పరిస్థితి విషమించడంతో హాపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.


వెంటనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించిన డాక్టర్లు.. అతని కడుపులో అనేక లోహపు వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్టర్ శ్యామ్ కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్.. ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 50కి పైగా వస్తువులను బయటకు తీశారు. ఆపరేషన్ సమయంలో అన్ని వస్తువులు అతడి కడుపులో ఉండటం చూసి తాము షాక్ అయినట్లు డాక్టర్ శ్యామ్ కుమార్ ఆపరేషన్ తర్వాత తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారని.. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.


అయితే ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఆ రోగిని డాక్టర్లు ప్రశ్నించారు. అన్ని వస్తువులు ఎలా మింగినట్లు నిలదీశారు. అయితే తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తన కుటుంబ సభ్యులు తనను డీ అడిక్షన్ సెంటర్‌లో వదిలేసి వెళ్లారని పేర్కొన్నారు. తనకు అసహనం, కోపం పెరిగిపోయాయని.. అందుకే కనిపించిన వాటిని మింగినట్లు డాక్టర్ల ముందు తెలిపాడు.


తనను అక్కడ సరిగ్గా చూసుకోలేదని.. సరిగా భోజనం కూడా పెట్టలేదని చెప్పారు. తనకు నిస్సహాయంగా, కోపంగా అనిపించి.. తనను తాను బాధించుకోవడానికి ఇలా కనిపించిన వస్తువులను మింగడం ప్రారంభించానని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఇక ఇది ఒక మానసిక రుగ్మత లాంటిది అని.. అలాంటి వారిలో ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో రోగులు ఆవేశంతో తమకు హాని కలిగించే వస్తువులను మింగేస్తుంటారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa