ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రూల్స్ తెచ్చిన ఆర్‌బీఐ.. 15 రోజుల్లో ఆ బ్యాంక్ ఖాతాల సెటిల్మెంట్

business |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 09:26 PM

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ లాకర్లకు సంబంధించి క్లెయిమ్ సెటిల్మెంట్ రూల్స్ సవరించింది. ఇకపై అలాంటి ఖాతాల్లోని సొమ్ములు, విలువైన వస్తువులు పత్రాలు నామినీలు, చట్టపరమైన వారసులకు వేగంగా చేరనున్నాయి. ఆయా ఖాతాలను 15 రోజుల గడువు లోపు సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తికావాలని, ఒక వేళ అంతకు మించి ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారాన్ని నామినీకి ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ ఆఫ్ బ్యాంక్స్) మార్గదర్శకాలు 2025 పరిధిలోని సవరించిన కొత్త రూల్స్ జారీ చేసింది. వీటిని సాధ్యమైనంత మేరకు అమలు చేయాలని స్పష్టం చేసింది. 2025, మార్చి 31 కంటే ఆలస్యం కాకూడదని తెలిపింది.


నామినేషన్ లేదా సర్వైవర్‌షిప్ క్లాజ్‌తో ప్రారంభించిన డిపాజిట్ అకౌంట్ అయితే డిపాజిటర్ మరణించిన సమయంలో నామినీ లేదా సర్వైవర్‌కి ఆ డిపాజిట్లను బదిలీ చేయాల్సి ఉంటుందని, అది బ్యాంకుల బాధ్యత అని ఆర్‌బీఐ తెలిపింది. నామినీ లేదా సర్వైవర్‌షిప్ క్లాజ్ లేని అకౌంట్ల విషయంలో క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సరళీకృత ప్రక్రియ అనుసరించాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట పరిమితికే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని వివరించింది. అకౌంట్లలో సహకార బ్యాంకులకు రూ.5 లక్షలు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షల లిమిట్ ఉంటుందని తెలిపింది. ఈ లిమిట్ మించిన మొత్తం ఉంటే వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి అదనపు పత్రాలు కోరవచ్చని వెల్లడించింది.


15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తి చేయకపోతే బ్యాంకు అకౌంట్ విషయంలో 4 శాతం వడ్డీ రేటుకు తక్కువ ఉండకుండా పరిహారం అందించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా కస్టడీలోని వస్తువుల విషయంలో ఆలస్యమైన ప్రతి రోజుకూ రూ.5 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో ఆర్‌బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను మరింత సులభతంర చేస్తోంది. చట్టపరమైన వారసులకు వేగంగా సొమ్ములు అందించేందుకు క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఒక్కతాటిపైకి తీసుకొస్తోంది. ఖాతా ఉన్న బ్యాంక్ వెబ్‌సైట్ లేదా ఆర్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు తనిఖీ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa