ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంటగ్యాస్ కనెక్షన్లకు మొబైల్ పోర్టబిలిటీ తరహా సౌకర్యం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 29, 2025, 08:42 AM

వంటగ్యాస్ వినియోగదారులకు త్వరలోనే ఒక శుభవార్త అందనుంది. మొబైల్ సిమ్ కార్డును నచ్చిన నెట్‌వర్క్‌కు మార్చుకున్నంత సులభంగా, ఇకపై గ్యాస్ కనెక్షన్‌ను కూడా ఇష్టమైన కంపెనీకి మార్చుకునే సరికొత్త అవకాశం రాబోతోంది. సర్వీసులో జాప్యం లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే, ఇకపై ఏజెన్సీతో పాటు ఏకంగా గ్యాస్ సరఫరా కంపెనీనే మార్చేసే వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, వినియోగదారులు తమ ప్రస్తుత గ్యాస్ కంపెనీ సేవలతో సంతృప్తిగా లేకపోతే మరో కంపెనీకి సులభంగా మారిపోవచ్చు. దీనినే 'ఇంటర్-కంపెనీ పోర్టబిలిటీ'గా వ్యవహరిస్తున్నారు. ఈ దిశగా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు  కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం వినియోగదారులు, గ్యాస్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు పీఎన్‌జీఆర్‌బీ వెల్లడించింది.అందరి నుంచి వచ్చిన సూచనలు, సలహాలను పరిశీలించిన తర్వాత, విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తామని బోర్డు తెలిపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ సేవలను ఎప్పటి నుంచి అమలు చేయాలో ఒక తేదీని అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ అనేది కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం 2013లో పైలట్ ప్రాజెక్టుగా 24 జిల్లాల్లో, ఆ తర్వాత 2014లో 13 రాష్ట్రాల్లోని 480 జిల్లాలకు ఈ సేవలను విస్తరించింది. అయితే, ఆ విధానంలో కేవలం ఒకే కంపెనీ పరిధిలోని వేరే ఏజెన్సీకి మాత్రమే మారే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రతిపాదించిన విధానం ద్వారా వినియోగదారులకు ఏ కంపెనీ కనెక్షన్‌కైనా మారే పూర్తి స్వేచ్ఛ లభించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa