తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే చిన్నారులు, మహిళలు సహా 41 మంది మృతి చెందిన విషయం అదరికీ తెలిసిందే. అయితే ఘటన జరిగి మూడు రోజులు కాగా.. తాజాగా ఈ కేసులో తొలి అరెస్టులు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ జిల్లా కార్యదర్శి మతియళగన్ సహా మొత్తం నలుగురిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మతియళగన్పై నేరపూరిత హత్య అభియోగాలతో కేసు నమోదు చేయగా.. అతడిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు.
ఈ విషాద ర్యాలీని ఏర్పాటు చేసి, నిర్వహించిన బాధ్యత మతియళగన్దేనని పోలీసులు నిర్ధారించారు. జనసందోహం అదుపు తప్పే పరిస్థితుల గురించి మతియళగన్కు, ఇతర టీవీకే నాయకులకు పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఈ హెచ్చరికలను వారు పట్టించుకోలేదని, విజయ్ తన ర్యాలీని కొనసాగించారని పేర్కొన్నారు. అలాగే కరూర్ తొక్కిసలాటపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై మరో ముగ్గురిని కూడా చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో పెరుంబాక్కంకు చెందిన 38 ఏళ్ల సహాయం, మాంగాడుకు చెందిన టీవీకే సభ్యుడు శివనేశ్వరన్, అవడికి చెందిన టీవీకే 46వ వార్డు కార్యదర్శి 32 ఏళ్ల శరత్ కుమార్ ఉన్నారు.
ఈ విషాద ఘటన అనంతరం టీవీకే చీఫ్ విజయ్కు చెందిన రాజకీయ ఈవెంట్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే,ఈ విషాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని.. కావాలని చేసిన కుట్ర అని టీవీకే ఆరోపించింది. ఈ విషయమై ఆ పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కానీ రాష్ట్ర డీజీపీ జి. వెంకటరామన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వాట్లాడారు. విజయ్ ఆలస్యంగా రావడంతో జనసందోహం ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరిగిందని.. ఫలితగా ప్రమాదం సంభవించిందని తెలిపారు.
మరోవైపు తొక్కిసలాటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కార్యక్రమంలో అనేక మంది పాల్గొనగా.. ప్రాంగణమంతా కిక్కిరిసిపోయినట్లు కనిపించింది. అదే సమయంలో కొందరు ఊపిరాడక ఇబ్బంది పడుతూ కనిపించారు. తర్వాత కాసేపటికే వాళ్లలో కొంత మంది చిన్న పిల్లలు సహా అనేక మంది సొమ్మసిల్లి కింద పడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన కార్యకర్తలు వెంటనే పరిస్థితిని గమనించి అంబులెన్సుల కోసం కేకలు వేయడం, విజయ్ తన ప్రసంగాన్ని ఆపి నీళ్ల బాటిళ్లను అందించడం వంటివి చేశారు.
కానీ జనం ఎక్కువగా ఉండటంతో అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడం కష్టమైంది. ఫలితంగా బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కాస్త ఆలస్యం జరిగింది. ఈ విషయ గుర్తించిన పలువురు.. స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు కూడా కొందరిని తరలించారు. వారిలో కొందరు ఇంకా ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఒక కమిషన్ కరూర్కు చేరుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa