ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ రేట్లు తగ్గించినా పాత ధరలకే విక్రయిస్తున్నారా.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 03:47 PM

సగటు మధ్య తరగతి జీవికి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లు సవరించిన సంగతి తెలిసిందే. సవరించిన జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకూ వస్తువుల రేట్లు తగ్గాయి. అయితే కొంతమంది వ్యాపారులు అక్కడక్కడా ఇంకా పాత ధరలకే విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని జీఎస్టీ అధికారులు కీలక సూచనలు చేశారు. ఇప్పటికీ ఎవరైనా పాత జీఎస్టీ రేట్లకు విక్రయాలు జరుపుతుంటే 8712631284 నంబరుకు కాల్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 అందుబాటులో ఉందని.. ఎవరైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించవచ్చని సూచించారు. ఇక ఫిర్యాదు చేసిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని జీఎస్టీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.


మరోవైపు జీఎస్టీ 2.0కు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీఎస్టీ అధికారులు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా గ్రామ స్థాయి, మండల స్థాయిలలో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులలో జీఎస్టీ రేట్ల తగ్గింపు గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత ఏయే వస్తువులు ఏమేరకు ధరలు తగ్గాయనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు జీఎస్టీ రేట్లు తగ్గించకుంటే నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్రం కూడా ఓ టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. జీఎస్టీ 2.0లో భాగంగా కేంద్రం జీఎస్టీలోని కొన్ని స్లాబ్‌లను ఎత్తివేసింది. మరి కొన్ని వస్తువులకు కూడా పన్ను తగ్గించింది.


అయితే రేట్లు తగ్గించిన ధరల మేరకు వినియోగదారులకు వస్తువులను విక్రయిస్తున్నారా లేదా అనే అంశంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు 1915 టోల్‌ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాట్సప్ నంబర్ 88000 01915 అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా వ్యాపారులు తగ్గింపు ధరలను అమలు చేయకుండా ఉన్నట్లయితే ఈ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం సూచించింది. అలాగే ఈ కామర్స్‌ సంస్థలు కూడా తగ్గిన జీఎస్టీ విధానం మేరకు సరకులు విక్రయిస్తున్నాయా లేదా అనే విషయంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సామాన్య ప్రజానీకం ఎక్కువగా వాడే 54 రకాల వస్తువుల ధరల్లో వచ్చిన తేడాలపై నివేదికలు ఇవ్వాలని జీఎస్టీ అధికారులను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa